iDreamPost

సోషల్ మీడియాలో వైరల్ అయిన టమోటా రైతు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

సోషల్ మీడియాలో వైరల్ అయిన టమోటా రైతు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

లాక్ డౌన్ సంక్షోభ కాలంలో అన్ని ఉత్పత్తులతో పాటు పండ్లు , కూరగాయలు కూడా అధిక ధరలకు అమ్ముడవుతున్నా ఆ ధరలో పావు వంతు కూడా రైతులకు దక్కకుండా దళారీలు సొమ్ము చేసుకొంటున్నారు .లాక్ డౌన్ వలన రాష్ట్రవ్యాప్తంగా రైతులు నష్టపోతున్నా రాయలసీమ రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు.

కొన్ని సంవత్సరాల తరువాత ఈ యేడు నీరు సమృద్ధిగా దొరకటంతో కరువు సీమలో కూడా పంటలు బాగా పండాయి. కూరగాయలు ,అరటి ,చీని తదితర పండ్ల దిగుబడి బాగుంది. కానీ లాక్ డౌన్ వలన దిగుబడిని మార్కెట్ కి తీసుకెళ్లలేకపోవటం, ఎదో విధంగా అక్కడికి తీసుకెళ్లిన కూలీ మరియు రవాణా ఖర్చుల మేర కూడా ధర పలకపోవటంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

పుట్టపర్తి నియోజక వర్గం ODC మండలానికి చెందిన రైతు నరసింహ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు బజార్లలో టొమాటోకు 10 నుండి 14 రూపాయలు గిట్టుబాటు ధర నిర్ణయించినా రైతుకు మాత్రం సగటున 2 నుండి 3 రూపాయలు ధర కూడా లభించట్లేదని , ఇతర పంటల మాదిరి టొమాటో నిల్వ ఉండే పంట కాకపోవటంతో తీవ్రంగా నష్టపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్టిన వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .

ఈ వీడియోను కొందరు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే రైతు పొలానికి వెళ్లి పంటని , దిగుబడిని పరిశీలించి అగ్రికల్చరల్ ఏడీ నారాయణ మూర్తి ని , జేడీ సుధాకర్ లని రైతు పొలం వద్దకే పిలిపించి అప్పటికప్పుడు విజయవాడ మార్కెట్ నిర్వాహకులతో మాట్లాడి రైతు పంటని 8 రూపాయల గిట్టుబాటు ధరతో హుటాహుటిన విజయవాడ తరలించారు .

అంతే కాక మిగతా రైతులకు కూడా మదనపల్లి మార్కెట్ ద్వారా 8 రూపాయల గిట్టుబాటు ధర లభించే విధంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ తో రైతు పొలం నుండే మాట్లాడారు. గిట్టుబాటు ధర అంశాన్ని పర్యవేక్షించే బాధ్యతలను అధికారులకు అప్పచెబుతూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు . నిన్నటి వరకూ నష్టపోతానని భయంతో తల్లడిల్లిన రైతు , అతనితో పాటు ఆ ప్రాంతానికి చెందిన మిగతా టొమాటో రైతులు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన సహాయానికి సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేశారు.

రైతు పంటకు గిట్టుబాటు ధర అన్నది ఒకరోజు సమస్య కాదు , దీర్ఘ కాల సమస్య , అనునిత్య ప్రక్రియ . దీన్ని గుర్తించి ఎప్పటికప్పుడు రైతుకు సరిఅయిన ధర లభించేట్టు పాలకులు చర్యలు తీసుకొంటేనే రైతు నష్టపోకుండా కాపాడిన వారు అవుతారు . ఈ దిశగా వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కృషి ప్రశంసనీయం .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి