iDreamPost

పంజాగుట్టు హిట్ అండ్ రన్ కేసు.. BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

  • Published Apr 08, 2024 | 10:25 AMUpdated Apr 08, 2024 | 10:25 AM

Ex MLA Shakeel Son: తెలంగాణలో సంచలనం సృష్టించిన పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వివరాలు..

Ex MLA Shakeel Son: తెలంగాణలో సంచలనం సృష్టించిన పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వివరాలు..

  • Published Apr 08, 2024 | 10:25 AMUpdated Apr 08, 2024 | 10:25 AM
పంజాగుట్టు హిట్ అండ్ రన్ కేసు.. BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాక.. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పంజాగుట్ట యాక్సిడెంట్ కేసు (ప్రజాభవన్ భారీ కేడ్ల ప్రమాదం)లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాహిల్‌ను సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యాక్సిడెంట్ అనంతరం అనేక సినిమాటిక్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కేసులో ప్రధాన నిందితుడైన రాహిల్.. ఏకంగా దేశం విడిచిపెట్టి దుబాయ్ పారిపోయాడు. తన తండ్రితో కలిసి గత నాలుగు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. నేడు అనగా సోమవాంర హైదరాబాద్ వస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలోనే రాహిల్‌ను అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే..

గత ఏడాది డిసెంబర్ 23 అర్ధరాత్రి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు రాహిల్‌ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో రాహిల్ తో పాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. యాక్సిడెంట్ సమయంలో రాహిల్ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నాడని.. అందుకే ప్రమాదం చోటు చేసుకుందని భావించారు. కేసు నమోదు కావడంతో.. రాహిల్ తన తండ్రి షకీల్‌తో కలిసి దుబాయ్ పారిపోయాడు.

ఇక ఈ కేసులో రాహిల్‌ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్‌ అబ్దుల్‌ ఆసిఫ్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పంపి కేసు నమోదు చేయించారు. కేసు విచారించిన పోలీసులు షకీల్ కుమారుడు రాహిల్ అసలు నిందితుడని గుర్తించి అతడపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో రాహిల్‌ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు సహకరించినట్లు వెల్లడయ్యింది. దాంతో అతడి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా.. దుర్గారావు.. షకీల్‌, నిజామాబాద్ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి.

ఈ కేసును తారుమారు చేసేందుకు, రాహిల్ ను తప్పించేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్‌కుమార్‌ జోక్యం చేసుకున్నారని అధికారులు గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయటంతోపాటు అరెస్టు చేసి విచారించారు. మెుత్తంగా ఈ కేసులో 8 మంది అనుమానితులను అరెస్టు చేశారు. యాక్సిడెంట్ తర్వాత దుబాయ్ పారిపోయిన రాహిల్.. నాలుగు రోజుల క్రితం రాహిల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తనపై జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసు ఎత్తివేయాలని… తాను విచారణకు పూర్తిగా సహరిస్తానని రాహిల్ తెలిపాడు. చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతడు హైదరాబాద్ రాగా.. పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారాహిల్స్‌లో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులోనూ రాహిల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ ప్రమాదంలో బాలుడు చనిపోగా.. రాహిల్‌ పై కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి