iDreamPost

తనను వేధిస్తున్నారంటూ.. మాజీ మంత్రి నారాయణపై ప్రియా పొంగూరు ఫిర్యాదు!

తనను వేధిస్తున్నారంటూ.. మాజీ మంత్రి నారాయణపై ప్రియా పొంగూరు ఫిర్యాదు!

నారాయణ సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడు భార్య ప్రియా పొంగూరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తనను వేధించారని, డేగలాగా తనపై కన్నేసి చిత్రహింసలకు గురి చేశారంటూ గత కొన్నిరోజులుగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆవిడ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. స్టోరీ నంబర్ 1 అని మొదలు పెట్టి ఇప్పటికే 4 కథలు చెప్పుకొచ్చారు. ఆ వీడియోల్లో నారాయణపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కొట్టారని, కనీసం తిండి కూడా తినకుండా రోజు మొత్తం నిల్చోబెట్టి తిట్టేవారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రియా పొంగూరు ఆయన వేధింపుల పర్వంపై పోలీసులను ఆశ్రయించారు.

గత కొన్నిరోజులుగా నారాయణ తమ్ముడు సుబ్రమణ్యం భార్య ప్రియా పొంగూరు పలు ఆరోపణలు చేయడం చూస్తూనే ఉన్నాం. తన జీవితం నాశనం చేశారని.. తనను చిత్రహింసలు పెట్టారంటూ నారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ప్రియా భర్త సుబ్రమణ్యం స్పందించిన విషయం తెలిసిందే. తన భార్య మానసిక రుగ్మతల కారణంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు. పైగా తనకు క్యాన్సర్ కూడా అటాక్ కావడంతో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు 2017లోనే ప్రియాకి చికిత్స చేయించామి.. 2019లో కూడా ప్రియా సొంతూరులో చికిత్స చేయించామన్నారు. 2020లో డాక్టర్ విరంచి వద్ద ట్రీట్మెంట్ చేయించినట్లు చెప్పారు.

అలాగే అప్పటి హెల్త్ రిపోర్ట్స్ కూడా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ప్రియా చేస్తున్న ఆరోపణల వల్ల తమ కుటుంబ పరువు పోతోందని చెప్పారు. అయితే ప్రియా పొంగూరు మాత్రం తాను చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ప్రియా మరో అడుగు ముందుకేశారు. ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. నారాయణ తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బాధను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోలు అప్ లోడ్ చేసిన తర్వాత తనపై వేధింపులు మరింత పెరిగాయని చెప్పుకొచ్చారు. అందుకే పోలీసులను ఆశ్రయించానంటూ వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి