iDreamPost

పింఛన్ల పై సీఎం జగన్ సంచలన నిర్ణయం

పింఛన్ల పై సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏళ్ల తరబడి పింఛన్‌ తీసుకుంటున్న లబ్ధిదారులు ఇటీవల అమలు చేసిన నూతన నిబంధనల కారణంగా అనర్హులయ్యారు. భూమి, విద్యుత్‌ బిల్లు, ఐటీ రిటన్స్‌.. అనే మూడు అంశాల వల్ల అనేక మంది అనర్హులుగా తేలారు. భూమికి సంబంధించిన నిబంధనల వల్లే అధిక శాతం లబ్ధిదారులు నష్టపోయారు. పొలం తక్కువగా ఉన్నా.. మీ భూమిలో ఎక్కువ చూపించడం, కుమారులకు భూమి పంచి ఇచ్చినా.. వారికి ఆ భూమి బదలాయింపు జరకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులకు నష్టం జరిగింది.

భారీగా పింఛన్‌ లబ్ధిదారులు నష్టపోవడంతో గ్రామాల్లో అలజడి రేగింది. గ్రామ స్థాయి నేతలు, అధికారులు ఈ విషయంలో చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగారు. అర్హులకు అన్యాయం జరగకుండా మళ్లీ పునఃపరిశీలన జరపాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాలతో కదలిన ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనర్హుల జాబితాను మళ్లీ రీవెరిఫికేషన్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారికి తిరిగి పింఛన్‌ పునర్ధురణ జరపాలని గురువారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఈ రోజు శుక్రవారం నుంచే ప్రక్రియ ప్రారంభం కానుంది. అనర్హత జాబితాలో ఉన్న 4.81 లక్షల పింఛన్లను మళ్ళీ పరిశీలించనున్నారు.

రీవెరిఫికేషన్‌లో అర్హులని తేలిన లబ్ధిదారుల పింఛన్‌ను తిరిగి పునరుద్ధరణ చేయనున్నారు. అంతేకాకుండా.. ఈ నెల పింఛన్‌ అందుకోని వారికి వచ్చే నెల మొదటి తేదీన రెండు నెలల (జనవరి, ఫిబ్రవరి) నగదు అందివ్వనున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉండి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని సీఎం సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి