iDreamPost

అక్కడైతే గెలిచేవాడిని.. పవన్‌ కళ్యాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

అక్కడైతే గెలిచేవాడిని.. పవన్‌ కళ్యాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

గత ఎన్నికల్లో ఓటమి జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ను ఇప్పటికీ వెంటాడుతున్నట్లుగా ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.. నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేశారు. రెండు చోట్లా ఆయన ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.

ఈ విషయమై తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కార్యకర్తల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో నేతలు చెప్పడంతోనే.. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశానని చెప్పుకొచ్చారు. లేదంటే.. తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయాలనుకున్నానని తన మనసులోని మాటలను బయటపెట్టారు. తాడేపల్లి గూడెం అయితే ఖచ్చితంగా గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తాను గూడెం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని పవన్‌ కళ్యాణ్‌ కార్యకర్తలతో చెప్పారు.

భవిష్యత్‌ రాజకీయంపై పవన్‌ తన ప్రణాళికను సూచాయగా వెల్లడించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తాజా వ్యాఖ్యలతో.. భీమవరం, గాజువాక నియోజకవర్గాలకు అతి త్వరలో గుడ్‌బై చెప్పబోతున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంపై దృష్టి పెట్టి అసెంబ్లీలో కూర్చోవాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే పవన్‌ కళ్యాణ్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. అయితే పవన్‌ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూడా అనేక నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని చెప్పిన పవన్‌… ఆ తర్వాత భీమవరం, గాజువాక నియోజకవర్గాలను ఎంచుకున్నారని గుర్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి