iDreamPost

దేశంలో 33 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల నిర్దారణ..

దేశంలో 33 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల నిర్దారణ..

1074 కి చేరిన కరోనా మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 33,050 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 1074 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 8325 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1718 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 67 మంది మరణించారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక మరణాలు, అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 597 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 9915 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 432 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

తెలుగురాష్ట్రాలలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతుంది. తెలంగాణలో 1016 పాజిటివ్ కేసులు నమోదవగా, 25 మంది మృతిచెందారు. వైరస్ బారినుండి తెలంగాణలో 367 మంది కోలుకున్నారు. తెలంగాణాలో గత మూడురోజులుగా మరణాల సంఖ్య నమోదు కాకపోవడంతో పాటు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదిలోపే నమోదుకావడం కాస్త ఊరటనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 1332 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 31 మంది మృతిచెందారు. 287 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న ఆక్టీవ్ కేసుల సంఖ్య 1014 గా నమోదయింది.

ప్రపంచవ్యాప్తంగా 3,220,969 మందికి కోవిడ్ 19 సోకగా 228,251 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,001,933 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,064,572 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 61,669 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి