iDreamPost

ఆ పత్రికలు ఉండగా.. ప్రతిపక్షాలు ఎందుకు దండగ ?!

ఆ పత్రికలు ఉండగా.. ప్రతిపక్షాలు ఎందుకు దండగ ?!

స్వాతంత్ర్యోద్యమంలో పత్రికల పాత్ర అమూల్యం . ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వ అరాచకాలు … అకృత్యాలను వెలుగులోకి తెచ్చి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో పత్రికలు కీలక భూమిక పోషించాయి . ఆనాడు పత్రికలు నిష్పక్షపాతంగా కేవలం సమాచారాన్ని అందించడానికి పరిమితమయ్యాయి . జరిగిన సంఘటన ఆధారంగా స్వాతంత్ర్య సమరయోధులు ప్రజా ఉద్యమాలను నిర్మించారు . వార్తల ఆధారంగా కొన్ని సార్లు స్వచ్చందంగా ప్రజలే ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి .

నాటికీ నేటికీ సమాచార మాధ్యమాల పాత్రలో గణనీయమైన మార్పు వచ్చింది . నేడు పత్రికలు , టీవీలే తమకు అనుకూలమైన ప్రభుత్వాల కోసం కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నాయి. ప్రతీ పార్టీకి సొంత ,అనుకూల మీడియాలు ఉన్నాయి . అధికార వైఎస్సార్సీపీకి సొంత సాక్షి మీడియా, వామపక్షాలకు ఏనాటి నుంచో సొంత పత్రికలు ఉన్నాయి . సిపిఎంకు ప్రజాశక్తి , సిపిఐకి విశాలాంధ్ర పత్రికలు బాసటగా నిలుస్తున్నాయి . తెలుగుదేశం పార్టీకి ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఈటీవీ , ఏబిఎన్ , టీవీ 5 సంస్థలు సొంత మీడియాలాంటివి .ఇవి టిడిపికి అనుకూలంగా ఉన్న పార్టీలు , నాయకుల వార్తలను ప్రముఖంగా వెలుగులోకి తెస్తాయి . ఆయా పార్టీలు టిడిపికి వ్యతిరేకమైతే వెంటనే వ్యతిరేక వార్తలను వండివారుస్తాయి . గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి వ్యతిరేక వార్తలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు .

ఇక జనసేనకు ఆంధ్రప్రభ , 99 టీవీ అనుకూలంగా ఉన్నాయి . ఒకప్పుడు నిష్పక్షపాతంగా ఉన్న ఆంధ్రప్రభ యాజమాన్యం ముత్తా గోపాలకృష్ణ చేతుల్లోకి వెళ్లిన తరువాత ఆయన కుటుంబం ఏపార్టీలో ఉంటే ఆపార్టీ తరపున పత్రిక పనిచేస్తుందన్న ప్రచారం ఉంది . అలాగే తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ , బిజెపిలకు అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి .

ఏపిలో ప్రతిపక్ష పాత్రలో పత్రికలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాన ప్రతిపక్షాల కన్నా ఆ రెండు పత్రికలు , మీడియా ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాయి . టిడిపి వాణిని గట్టిగా వినిపించడంతో పాటు , ప్రజావ్యతిరేకతను కూడగట్టడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి . ఆ పత్రికలు , మీడియా ఆడించినట్లు ప్రతిపక్షాలు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత వైసిపి పాలనలో అన్నీ తప్పులే జరుగుతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రతీరోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో మొదటి పేజీ వార్తలు వైసిపి ప్రభుత్వ వ్యతిరేక వార్తలతో నింపేస్తున్నాయి. కొన్ని సంఘటనలను బూతద్దంలో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి . ఆయా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే తెలుగుదేశం , జనసేన , బిజెపి పార్టీలు సమావేశాలు , ఆందోళనలు , సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాయి. రాత్రికి అవే అంశాలపై టీవీ -5 , ఏబిఎన్ చానళ్లలో డిబేట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రజానుకూల విధానాలు ఒక్కటీ అమలు జరగడం లేదా అన్న అనుమానాలు ఆ పత్రికలు చదివిన వారికి రాక మానదు .

సాక్షి లేకపోతే పరిస్థితి ఎలాగుండేదో ?

ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని పత్రికల పనితీరును ఆనాడే గుర్తించారు . పదేపదే ఆరెండు పత్రికలు అంటూ ఈనాడు , ఆంధ్రజ్యోతిని ఎద్దేవా చేసేవారు . ఆపత్రికల వ్యతిరేక గళాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకే సాక్షి మీడియాను ప్రారంభించారు . సాక్షి మీడియా ఆయా పత్రికలు , మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పింది. సోషల్ మీడియా కూడా కాస్తోకూస్తో ప్రభావం చూపిస్తోంది . అయితే అసలు సాక్షి మీడియానే లేకపోతే ఈమాత్రం వాస్తవాలు కూడా ప్రజలకు తెలిసేవి కావు. అప్పుడు బాలకృష్ణ చెప్పినట్లు ఒకవైపే చూడు అన్నట్లు వార్తలన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే కనిపించేవి . వైఎస్ ఉండగా ఆరెండు పత్రికలు ఎంత గొంతు చింపుకున్నా టీడీపీని అధికారంలోకి తేలేకపోయాయి. నిజానిజాలు తెలియజెప్పే సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ఉన్న నేటికాలంలో ఆ మీడియా లక్ష్యాలు నెరవేరే అవకాశం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి