iDreamPost

విలక్షణ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా

విలక్షణ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా

భీష్మతో 2020 సంవత్సరానికి రెండో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ కరోనా వల్ల దాని ఫుల్ రన్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు. భారీ వసూళ్లు దక్కినప్పటికీ ఇంకో రెండు మూడు వారాలు కొనసాగే అవకాశాన్ని థియేటర్ల మూత వల్ల మిస్ చేసుకుంది. దీని తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేస్తున్న నితిన్ అందులో కీర్తి సురేష్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ ఇప్పటికే యూత్ ని ఆకట్టుకుంది. ఇదిలా తన మరో ప్రాజెక్ట్ ని కూడా నితిన్ అనౌన్స్ చేయించేశాడు.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించబోయే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించబోతున్నట్టు సమాచారం. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు. ఏలేటితో నితిన్ సినిమా చేస్తాడనే టాక్ ముందు నుంచే ప్రచారంలో ఉంది కానీ ఇప్పటికి ఖరారయ్యింది. విలక్షణ సినిమాలు చేస్తారని పేరున్న చంద్రశేఖర్ ఏలేటి ఫస్ట్ మూవీ ఐతేతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. కొత్త కుర్రాళ్లతో ఆయన చేసిన కిడ్నాప్ డ్రామా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఆ తర్వాత చార్మీతో చేసిన అనుకోకుండా ఒక రోజు సైతం విమర్శకుల ప్రశంశలు దక్కించుకుంది. గోపి చంద్ తో చేసిన ఒక్కడున్నాడు, సాహసం టెక్నికల్ గా పేరు తెచ్చినప్పటికీ కమర్షియల్ గా ఆశించిన విజయాలు సాధించలేకపోయాయి.

మోహన్ లాల్ తో చేసిన స్ట్రెయిట్ మూవీ మనమంతా కూడా అదే ఫలితాన్ని అందుకుంది. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేస్తారని పేరున్న చంద్రశేఖర్ యేలేటి ఇప్పుడు నితిన్ తో ఎలాంటి సినిమా చేస్తారనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే వివరాలు కరోనా గొడవ సద్దుమణిగాక తెలిసే అవకాశం ఉంది. రంగ్ దే సమ్మర్ లో రిలీజైతే ఈ సినిమాని ఏడాది చివర్లో ఆశించవచ్చు. అదే జరిగితే నితిన్ ఒకే ఏడాదిలో మూడు సినిమాలు చేసినట్టు అవుతుంది. బర్త్ డే సందర్భంగా నితిన్ తాను మంచి దూకుడు మీదున్నట్టు చెప్పకనే చెబుతున్నాడు. ఈ నెల 16న జరగాల్సిన పెళ్లి కూడా వాయిదా పడింది కాబట్టి కొత్త డేట్ ని తర్వాత ప్రకటిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి