iDreamPost

రిలయన్స్​ బోర్డు నుంచి తప్పుకున్న నీతా అంబానీ! ఎందుకంటే..?

  • Author singhj Published - 04:12 PM, Mon - 28 August 23
  • Author singhj Published - 04:12 PM, Mon - 28 August 23
రిలయన్స్​ బోర్డు నుంచి తప్పుకున్న నీతా అంబానీ! ఎందుకంటే..?

భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ ఏజీఎం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇందులో ముఖ్యమైనది నీతా అంబానీ రాజీనామా. రిలయన్స్ బోర్డు నుంచి తన సతీమణి తప్పుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఇదే టైమ్​లో రిలయన్స్ ఇండస్ట్రీలోకి తమ వారసులు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీకి చోటు కల్పిస్తున్నామని వెల్లడించారు. వీళ్లను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ సేవల్ని మరింత ఫోకస్డ్​గా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే నీతా అంబానీ రాజీనామా చేశారని సమాచారం. ఇక, రిలయన్స్ ఏజీఏం సందర్భంగా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఫైలింగ్​ గురించి కూడా వెల్లడించారు. అనంతరం వాటాదారులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో సైంటిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్​ డెవలప్​మెంట్​కు సంబంధించి కూడా పలు ముఖ్యమైన ప్రకటనలు చేశారాయన. గత పదేళ్లలో రిలయన్స్ సంస్థ 150 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిందని ముకేశ్ తెలిపారు.

దేశంలోని ఏ ఇతర కార్పొరేట్ కంపెనీ కూడా రిలయన్స్ మాదిరిగా ఇన్వెస్ట్​మెంట్స్ చేయలేదన్నారు ముకేశ్ అంబానీ. కష్టసాధ్యమైన లక్ష్యాల్ని కూడా తాము సుసాధ్యం చేశామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవల్ని అందించేందుకు వినూత్న పద్ధతులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. భారత్​లో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటిందని అంబానీ తెలిపారు. రిలయన్స్ సంస్థలో అన్ని విభాగాల్లోనూ కలిపి 2.6 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే రిలయన్స్ జియో తీసుకురానున్న జియో ఎయిర్ ఫైబర్​ను వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 19న లాంఛ్ చేయనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి