iDreamPost

AP అప్పులపై పచ్చ బ్యాచ్‌కు కేంద్రం దిమ్మతిరిగే కౌంటర్‌!

  • Published Aug 01, 2023 | 10:32 AMUpdated Aug 01, 2023 | 10:43 AM
  • Published Aug 01, 2023 | 10:32 AMUpdated Aug 01, 2023 | 10:43 AM
AP అప్పులపై పచ్చ బ్యాచ్‌కు కేంద్రం దిమ్మతిరిగే కౌంటర్‌!

సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని.. వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైందంటూ విపక్షాలు భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై టీడీపీతో పాటు దాని అనుబంధ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారానికి కేంద్రం తాజా ప్రకటనతో ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ఆర్థిక పరిస్థితి, అప్పులపై టీడీపీ చేస్తోన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. 2019 నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్లు అప్పులుండగా 2023 మార్చి నాటికి రూ.4,42, 442 కోట్లకు చేరినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది..’’ అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనిలో ఏపీ ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల మేరకు వ్యవహరిస్తోందని నిర్మలా సీతారామన్‌ తేల్చి చెప్పారు. ద్రవ్యలోటు తగ్గింపు, వివేకంతో కూడిన రుణ నిర్వహణ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో సుస్థిరత, పారదర్శకతను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎంను అసెంబ్లీ కరెక్ట్‌గా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

కాకి లెక్కలకు కౌంటర్‌..

వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఒకే సారి 8 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అప్పుల చేశారంటూ.. టీడీపీ నిత్యం అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. ఈ విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నా రహస్యంగా అప్పులను దాచారనే విధంగా టీడీపీ, దాని అనుకూల మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. పరిమితులకు లోబడే అప్పులు తీసుకుంటున్నామని, టీడీపీ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులను సామాజిక హితం కోణంలోనే ఖర్చు చేస్తోంది. ఆ మొత్తాన్ని.. భారీగా సంక్షేమ పథకాలు, నగదు బదిలీతో పేదలకు లబ్ధి చేకూరుస్తోంది.

కోవిడ్‌ సమయంలోనూ డీబీటీతో పేదలను ఆదుకోవడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా చర్యలు తీసుకుంది జగన్‌ ప్రభుత్వం. తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇవన్నీ ముమ్మాటికీ నిజమని మరోసారి రుజువైంది. ఈ గణాంకాలను ఆర్బీఐ నివేదిక ప్రకారం వెల్లడిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన సమాధానంలో వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి