Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూ అక్రమాల పుట్ట కదులుతోంది. కబ్జాల బాగోతం బట్టబయలు కావడంతో అధికారులు కూకటివేళ్లతో సహా పెకలించివేస్తున్నారు. పల్లాతో పాటు ఆయన బంధుగణం దోచుకున్నభూములను చూస్తే విస్తుపోవడం అధికారుల వంతవుతోంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూ బకాసురుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 38.45 ఎకరాల భూముల్లో ఆక్రమణలు తొలగించారు. మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రూ.669.26 కోట్లు ఉంటుందని లెక్క కట్టారంటే ఏ మేరకు కబ్జాలకు గురయ్యే అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
Also Read:మోదీ ఇలాకాలో పాగా వేస్తామంటున్న ఆప్
అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అండ్ కో సాగించిన భూదందాకు రెవెన్యూ యంత్రాంగం ఫుల్స్టాప్ పెట్టింది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వెంటనే.. ప్రభుత్వ భూములపై ఎగబడి బంధుగణంతో కలిసి అందినకాడికి ఆక్రమించుకున్న పల్లా శ్రీనివాసరావు ఆక్రమణల బాగోతాన్ని సర్వే నంబర్లతో సహా బయటపడడంతో వాటిని పరిశీలించి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఆక్రమణలు తొలగించి.. స్వాధీనం చేసుకోవాలని వారు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పల్లా ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 15 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి పలు కంపెనీలకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్లు కొల్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే బంధుగణం దర్జాగా అనుభవిస్తున్న ప్రభుత్వ ఆక్రమిత భూములను గుర్తించి రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు.
గాజువాక నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ జాగా, పోరంబోకు స్థలం, ప్రభుత్వ భూమి, చెరువు.. ఏం కనిపించినా విడిచిపెట్టకుండా ఆక్రమించేశారు. జగ్గరాజుపేట, తుంగ్లాం, కూర్మన్నపాలెం రెవెన్యూపరిధిలో ఆక్రమించేసుకున్న 38.45 ఎకరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.
Also Read:ఆ సీటు కోసమేనా.. మాజీ మంత్రి పాట్లు
జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 28–1, 28–2లో 1.26 ఎకరాలు వాగు స్థలం స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా తుంగ్లాంలోని సర్వే నం.9–6, 10–2లోని 0.92 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.12–1 నుంచి 12–14 వరకూ 6.15 ఎకరాల యూఎల్సీ ల్యాండ్, 14–1లోని 1.85 ఎకరాల పోరంబోకు చెరువు, సర్వే నం.28లోని 21.67 ఎకరాల పోరంబోకు చెరువు, 29/1బీలోని 0.70 ఎకరాల ఇనాం భూములు, 29/2లోని 0.80 ఎకరాల పోరంబోకు బంద, 30–12, 30–13, 30–15లోని 2.04 ఎకరాల గయాలు భూములు, 33/2, 33/4లోని 1.50 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.34–2లోని 0.24 ఎకరాల పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను తొలగించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా కూర్మన్నపాలెంలోని సర్వే నం. 8/6లోని 1.35 ఎకరాల పోరంబోకు భూమిలోని ఆక్రమణలను తొలగించారు. ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎల్అండ్టీ, హెచ్పీసీఎల్ సంస్థలకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్ట్ పనులకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్ల రూపాయలు గడించినట్టు రికార్డులు చెబుతున్నాయి.
Also Read:జగన్, కేసీఆర్ ఎటువైపు?
టీడీపీ నేతల కబ్జాల పుట్ట ఇలా ఉంటే.. అచ్చెన్నాయుడు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రశ్నించిన వారి ఆస్తులను కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకొని భయోత్పాతం సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘సెలవురోజుల్లో విధ్వంసం’ పేరుతో ఏపీలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేస్తున్న అచ్చెన్నకు ఈ కబ్జాలు కనిపించడం లేదా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.