iDreamPost
android-app
ios-app

ఆ.. మనకు రాదు లే..!

  • Published Apr 22, 2020 | 8:49 AM Updated Updated Apr 22, 2020 | 8:49 AM
ఆ.. మనకు రాదు లే..!

ఆ.. మనకు రాదులే. భుజాలు ఎగరేస్తూ.. పళ్ళ మధ్య నాలుకను బయటకు చూపుతూ.. మనకు కరోనా రాదులే..అనే వారి కోసమే ఈ పోస్టు. జాతి, మతం, రంగు, ఆఖరికి ఒడ్డు పొడుగు, బరువులతో సంబంధం లేకుండా ప్రతి మనిషి వస్తుంది. నాది మనిషి పుట్టుక కాదంటారా..? మీ ఇష్టం.

కానీ సమాజాన్ని మాత్రం చంపకండి.. అని మాత్రం చేతులెత్తి దండం పెడతాం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బ్రిటన్ ప్రధానికి ఆల్రెడీ వచ్చేసింది. ఒక దేశ రాజకుమారి చచ్చిపోయింది కూడా. అమెరికా, రష్యా అధ్యక్షులు సైతం తమకు ఎప్పుడు సోకుటుందో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దేశంలో ప్రముఖ నాయకులందరూ ఇళ్లలో నే ఉండిపోయారు. ఇంత జరుగుతుందని టివిలు, పేపర్లు, సోషల్ మీడియాలో ప్రతిరోజు వస్తున్నా కూడా అంత నిర్లక్ష్యంగా కొందరు ఎలా ఉండగలుగుతున్నారో అర్థం కావడం లేదు.

ఒక ఆవిడేమో ఒడియాలు పెట్టడానికి వెళ్ళాను అంటుంది.

మరొకరేమో తనకు కావాల్సిన బ్రాండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటాడు. ఇంకొకడు ఏమో ఇంట్లో ఉండలేక పోతున్నాను అని అంటాడు. మీ మీ కారణాలు మీకు ఉండొచ్చు. కానీ సమాజం పట్ల బాధ్యత ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. కరోనా ఎలా వ్యాపిస్తుంది మనకు తెలిసింది గోరంత అని చెప్పాలి. వస్తే ఎంతకాలం ఉంటుంది. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది. ఇలా అనేక ప్రశ్నలు ఇంకా ఆ వ్యాధి గురించి ప్రశ్నగానే మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ శక్తిమేరకు వైద్యరంగం, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నానా పాట్లు పడుతున్నారు. వారందరికీ మీరిచ్చే గౌరవం నిబంధనలు ఉల్లంఘించడమేనా..?

కొందరు దాతలు మీ ఇంటికి తెచ్చి కూరగాయలు, నిత్యవసర వస్తువులు ఇచ్చేది మీరు ఇంట్లోనే ఉండమని. కనీసం అదైనా గుర్తిస్తున్నారా.. అంటే అదీ లేదు. కొంతమంది పని పాట లేకుండా రోడ్డు ఎక్కిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో తాను కర్నూల్ నుంచి ప్రయాణించి వచ్చిన విషయం దయచేసి దాదాపు ఏడుగురికి ఆ వ్యాధి రావడానికి ఓ మహిళ కారణమైంది..అంటే అది నిర్లక్ష్యం అనాలా..? ఇంకేమైనా అనాలో అర్థం కాని పరిస్థితి. నిర్లక్ష్యం ఎలా ఉందంటే ఆమెకు ట్రీట్మెంట్ చేసి ఆ వ్యాధి బారిన పడ్డాడు ప్రాథమిక వైద్యుడు. బయటకు వస్తే శిక్షలు వేస్తామని పోలీసులు చెబుతున్నారు. మనం వాళ్ళ మీద జోకులు వేసుకుంటున్నాం. దొంగ పోలీసు ఆట ఆడుతున్నాము. కానీ వాస్తవం ఏమిటంటే.. ప్రమాదాన్ని మనమే కొని తెచుకుంటున్నాం.

రేపు కరోనా తగ్గినా.. లాక్ డౌన్ ఎత్తి వేసినా.. నిత్యం జాగ్రత్తగా ఉండాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సామాజిక దూరం పాటించాలి. ఏమాత్రం ఇబ్బంది ఉన్న ఆసుపత్రికి పరిగెట్టాలి. ఇంకా చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే.. మన కంటే ముందే కరోనా పొంచి ఉందేమోనని బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిందే. మనం కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇవన్నీ పాటించి తీరాల్సిందే. ఇది ఎంత కాలం అంటే వైద్యరంగం టీకా, ఔషధం కనిపెట్టేంత వరకు. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పక తప్పదు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వదలకపోతే చుట్టుపక్కల వాళ్ళు మన గురుంచి వ్యవస్థలకు సమాచారం ఇస్తారు. అప్రమత్తంగా ఉందాం. సో..బుద్ధి జీవుడా.. నువ్వు బ్రతుకు. నీ తోటి వారిని బ్రతకనివ్వు.