iDreamPost
iDreamPost
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1991లో ప్రారంభమయిన నూతన ఆర్థిక విధానాల రూపకల్పనలో పీవీకి తోడుగా నాటి ఆర్థిక మంత్రి ఆయన. ఆ తర్వాత యూపీఏ హయంలో రెండుమార్లు ప్రధానిగా వివిధ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సరళీకరణ విధానాలకు ఆయన స్థిరమైన మద్ధతుదారుడు. ఆది నుంచి ఇప్పటికీ ఆయన అదే విధానాలకు బలమైన సమర్థుకుడిగా ఉన్నారు.
తాజాగా కోవిడ్ తదనంతర పరిణామాల్లో ఆర్థిక పరిస్థితులపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంట్వర్యూలో మన్మోహన్ వర్తమాన పరిస్థితిని విశ్లేషించారు. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రం కాబోతోందని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు అనుగుణంగా మూడు మార్గాలను కూడా సూచించారు. వాస్తవానికి కరోనా కన్నా ముందే దేశంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని ఆయన ప్రస్తావించారు. అప్పట్లోనే మోడీ సర్కారుకి ఆయన సూచనలు చేశారు. కానీ వాటిని బీజేపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ప్రస్తుతం ఆర్థికంగా మరింత పతనం అయ్యే పరిస్థితి కనిపిస్తోందని వివిధ రంగాల నిపుణులు అంగీకరిస్తున్నారు.
మన్మోహన్ తాజాగా చెప్పిన మూడు మార్గాల్లో కీలకమైనది, మొదటిది ప్రజలకు మరింతగా నగదు బదిలీ జరగాలి. తద్వారా కొనుగోలు శక్తి పడిపోకుండా నివారించవచ్చన్నది ఆయన సూచన. మార్కెట్లను నిలబెట్టడం ద్వారా ఉత్పత్తిని నిలిచిపోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చని ఆయన చెబుతున్నారు. అది స్థిరంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే దేశంలోనే జగన్ సర్కారు ఆదర్శనీయంగా కనిపిస్తోంది. కరోనా కాలంలో కూడా వివిధ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. సంక్షేమ పథకాలు చురుగ్గా సాగుతున్నాయి. తద్వారా ఏపీలో ఆర్థిక కార్యకలాపాల విషయంలో జగన్ సర్కారు చొరవ కనిపిస్తోంది. అదే సమయంలో ప్రజల జీవనోపాథి దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని ప్రస్తావించారు. తద్వారా మన్మోహన్ సింగ్ చెబుతున్న ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో జగన్ ప్రభుత్వం ఆచరణను గమనించవచ్చు.
మరో ముఖ్యాంశం అప్పుల విషయంలో ప్రస్తుతం ఆందోళన వద్దని మన్మోహన్ సింగ్ సూచిస్తున్నారు. తాత్కాలికంగా అప్పులు పెరిగినప్పటికీ ఖాతరు చేయవద్దని ఆయన చెబుతున్నారు. జీడీపీలో అప్పుల శాతం పెరిగిందనే కలవరం కూడదంటున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల అమలు విషయంలో పెరుగుతున్న అప్పులను దృష్టిలో పెట్టుకుని నిలిపివేసే పరిస్థితి రాకూడదని సూచిస్తున్నారు. కొత్త అప్పులను సద్వినియోగం చేసుకుని ప్రజల జీవనోపాధి పెంచేందుకు తోడ్పడేలా వినియోగిస్తే భవష్యత్తులో వాటి ఫలితాలు చూస్తామని అంటున్నారు. అప్పుల ద్వారా తెచ్చిన మొత్తం ఎలా వినియోగిస్తామన్నదే ముఖ్యమని చెప్పారు. ఈ అంశంలో ఇప్పటికే జగన్ పర్భుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ జగన్ మాత్రం రాష్ట్రంలో అప్పుల కన్నా పథకాల అమలు, ప్రజల కొనుగోలు శక్తి కాపాడేందుకే ప్రాదాన్యతనిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి ఆర్థిక వేత్తల అభిప్రాయాలు, జగన్ ప్రభుత్వ అనుభవాలు ఒకేలా ఉన్నాయనే విషయం చర్చనీయాంశం అవుతోంది. కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవహారాలు తలకిందలవుతున్న తరుణంలో నష్టనివారణ మార్గాలను నిపుణులు చెబుతున్న బాటలోనే జగన్ పాలన ఉన్నట్టు కనిపిస్తోంది. పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో సంక్షోభాల నివారణకు చేపట్టాల్సిన మార్గాలకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకంగా ఉన్నట్టు కనిపిస్తోంది.