Idream media
Idream media
తెలుగురాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వలసలను ప్రోత్సహిస్తూ తన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ నేతలే లక్ష్యంగా సోము ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసి ఆ దిశగా ఫలితాలు సాధిస్తున్నారు. గత నెలలో టీడీపీకి గుడ్బై చెప్పిన గద్దె బాబూరావు బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునీల్ దేవధర్ సమక్షంలో ఇవాళ ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చి కలకలం సృష్టించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో పరిస్థితి మరోలా ఉంది.
తెలంగాణలో…
తెలంగాణలో కూడా బలపడేందుకు బీజేపీ విశేషంగా కృషి చేస్తున్న సమయంలో కొంత మంది నేతలు పార్టీని వీడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి (ప్రస్తుతం కాదు) రావుల శ్రీధర్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరారు. రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానానికి పంపారు. బీజేపీలో తాను 11 సంవత్సరాలుగా ఉన్నానని, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేక టీఆర్ఎస్ లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. బీజేపీ తరఫున శ్రీధర్రెడ్డి గొంతును వినిపిస్తుండేవారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. నిన్న మొన్నటి వరకూ దుబ్బాక ఉప ఎన్నికపై కూ శ్రీధర్ మాట్లాడారు. టీవీ డిబెట్స్, మీడియా మీట్లు పెట్టి మరీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరుపై మండిపడ్డారు. సడన్గా పార్టీ మారి బీజేపీపై ఆరోపణలు కురిపించారు.
మరో బీజేపీ సీనియర్ నాయకుడు కంజర్ల మహేందర్ యాదవ్ కూడా బీజేపీలో సోమవారం చేరారు. తన భార్య పల్లవి ని కూడా బీజేపీలో చేర్చారు. 30 ఏళ్లుగా పని చేస్తున్నా బీజేపీలో గుర్తింపు రాలేదని మహేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీలోకి ఒక రాష్ట్రంలో వలసలు రావడం.. మరో రాష్ట్రంలో పార్టీని వీడి వెళ్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.