iDreamPost
android-app
ios-app

Badvel-బద్వేలు బరిలో లేకున్నా బాబుకి ఓటమి భారమే.

  • Published Nov 02, 2021 | 2:29 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
Badvel-బద్వేలు బరిలో లేకున్నా బాబుకి ఓటమి భారమే.

బద్వేలు ఉప ఎన్నికల పలితాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ ఊపు కొనసాగుతోంది. సాధారణ ఎన్నికలతో మొదలుకుని స్థానిక ఎన్నికల వరకూ అన్నింటా విజయబావుటా ఎగురవేసిన వైఎస్సార్సీపీ ఉప ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో సాగుతోంది. భారీ మెజార్టీ దిశగా వెళుతోంది. 2019 ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు మెజార్టీ ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారుతోంది. ఒకవైపు పోటీ చేయలేక చేతులెత్తేశారనే అభిప్రాయం చాలామందిలో వినిపిస్తోంది. సానుభూతి పేరు చెప్పుకుని, సంప్రదాయం ముసుగులో పలాయనం చేశారనే వాదన బలపడింది. దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రచారం, పోలింగ్ సమయంలో టీడీపీ నేతలే కీలక పాత్ర వహించడం ఆపార్టీని ఇరకాటంలో నెట్టింది.

వాస్తవానికి టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించి చేతులు ముడుచుకుని కూర్చుంటే ఓ విధంగా ఉండేది. కానీ పేరుకి ప్రకటించినా బీజేపీ అభ్యర్థిని భుజాన మోసేందుకు బద్వేలు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీజేపీకి ప్రజల్లో ఆదరణ లేక, టీడీపీకి అసలు పోటీ చేసే సత్తా లేక చివరకు ఇరు పార్టీలకు ఇది శిరోభారమయ్యింది. బీజేపీ అభ్యర్థికి కనీసం 20వేల ఓట్లయినా దక్కుతాయా లేదా అనే సందేహాలున్నాయి. ఆ మార్క్ దాటినా లేకున్నా బంపర్ మెజార్టీతో డాక్టర్ సుధ విజయం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వ్యూహం మరోసారి విఫలమయ్యిందనే చెప్పాలి. బాబు బంటులనే ముద్రపడిన సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటి వారు బీజేపీ నేతల పాత్రలో క్రియాశీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ మెజార్టీని తగ్గించాలని గట్టిగా శ్రమించారు. భారీగా పంపిణీలు కూడా చేశారనే ప్రచారం ఉంది. పెద్ద మొత్తంలో బీజేపీ నేతలు ఓట్ల కొనుగోలుకి యత్నించడమే బద్వేలులో విశేషంగా చెప్పాలి. అదంతా వైఎస్సార్సీపీ విజయాన్ని కాకపోయినా, మెజార్టీని తగ్గించే యత్నంలో చంద్రబాబు వేసిన స్కెచ్ లో భాగమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబు అనుకున్న లక్ష్యాలు నెరవేరే సూచనలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా వైఎస్సార్సీపీ అధినేత నిర్దేశించినట్టు మెజార్టీ ఎనభై వేలు దాటితే  టీడీపీకి ఇది ఘోర అవమానంగా భావించాలి. ఓటమి భారంతో బీజేపీ, అవమానంతో టీడీపీ కూడా బద్వేలులో పరువు పోగొట్టుకున్నట్టవుతుంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత ఉందంటూ ప్రభుత్వం మీద చేసిన విమర్శలకు జనంలో ఆదరణ లేదని తేలిపోతుంది. ప్రజాభిప్రాయం భిన్నంగా ఉందని, విపక్షాలు ఊహాల్లో ఉన్నాయనే అంశం స్పష్టమవుతుంది. ఏదిఏమయినా పోటీలో లేకుండానే చంద్రబాబు పరువు తీసుకునే పని చేసినట్టు టీడీపీ నేతలే ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి రావడం విశేషం. టీడీపీ వ్యూహాత్మక వైఫల్యాలకు తాజా ఉదాహరణగా ఈ ఉప ఎన్నికలు మిగులుతాయి.