iDreamPost

Natyam : సత్యం రామలింగరాజు కోడలే ‘నాట్యం’ హీరోయిన్!

Natyam : సత్యం రామలింగరాజు కోడలే ‘నాట్యం’ హీరోయిన్!

సాధారణంగా మన తెలుగు ప్రేక్షకులు సంప్రదాయ కళల మీద సినిమాలు చేస్తే పెద్దగా ఆసక్తి చూపించరు. ఎక్కడో సాగరసంగమం, శంకరాభరణం లాంటి సినిమాలు బాగా ఆడాయి తప్ప ఆ తరువాత అలాంటి సినిమాలను పెద్దగా ఆదరించలేదు. అయితే గత కొద్ది రోజులుగా నాట్యం అనే సినిమా చర్చనీయాంశవుతోంది. ఎందుకంటే కల్చరల్ సర్కిల్ లో తప్ప సినిమా సర్కిల్ లో పెద్దగా పేరు లేని సంధ్యారాజు హీరోయిన్ గా పరిచయం అవుతుంటే ఆమెకు ఉపాసన, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం మీద చర్చ జరుగుతోంది. నిజానికి ముందుగా ‘నాట్యం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఆ తరువాత ఈ సినిమా టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఏకంగా హైదరాబాద్‌లోని సంధ్యా రాజు ఆఫీస్ కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్.. అక్కడ నటరాజ స్వామి వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం టీజర్‌ను విడుదల చేశారు. సాధారణంగా ఎవరైనా తమ సినిమా ప్రమోట్ చేసి పెట్టమని ఎదురు వెళ్లి అడగాలి. కానీ స్వయంగా ఎన్టీఆర్ వెళ్లి రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె బ్యాక్ గ్రౌండ్ మాములుది కాదు.

సంధ్యా రాజు.. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు, అలా పేరు. తెలిసిన వారికి కూడా ఆమె ఒక మంచి కూచిపూడి నృత్యకారిణి అని తెలుసు కానీ ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ఎందుకంటే ఆమె ఒక బిగ్ షాట్ కూతురు.. మరో బిగ్ షాట్ కోడలు. సంధ్యా రాజు హీరోయిన్‌గా పరిచయం అవుతోన్న ‘నాట్యం’ సినిమా టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయడం, రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం సహా ట్రెయిలర్ లాంచ్ చేశారు. అలాగే స్వయంగా చిరంజీవి కలిసి విషెస్ చెప్పడంతో అసలు ఈమె ఎవరు అనే అంశం హాట్ టాపిక్ గా మారింది.

ఆమె ప్రముఖ వ్యాపారవేత్త, మల్టీ మిలియనీర్, రామ్‌కో గ్రూప్ చైర్మన్ పి.ఆర్. వెంకట్రామ రాజా కుమార్తె. అలాగే, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు చిన్న కుమారుడిని వివాహమాడి కోడలయ్యారు. అయితే, సంధ్యా రాజు కూచిపూడి డాన్సర్‌గానే చాలా మందికి తెలుసు. ఎందుకంటే, ఈ కూచిపూడి ద్వారానే ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆమె సంపాదించింది. ఆమె నర్తించిన ‘కృష్ణ శబ్దం’ అనే వీడియోకు యూట్యూబ్‌లో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక కూచిపూడి నర్తకి వీడియోకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం దేశంలోనే ప్రప్రథమం అంటున్నారు.

ఆమె రాంకో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. సంధ్య డాక్టర్ వెంపటి చిన్న సత్యం దగ్గర నాట్యం నేర్చుకున్నారు. ఇప్పటిదాకా ఆమె 1000 కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె నిష్రింకల అనే నృత్య పాఠశాలను కూడా నడుపుతోంది, దీని ద్వారా ఆమె అనేక మంది ప్రతిభావంతులకు ఉచితంగా శిక్షణనిచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాట్యం సంధ్య రాజుకి మొదటి సినిమా కాదు.

ఆమె 2017 లో మలయాళ థ్రిల్లర్ చిత్రం కేర్‌ఫుల్ (రీమేక్ ఆఫ్ యు-టర్న్) చిత్రంలో నటించింది. కానీ అక్కడ సినిమా రిలీజ్ అయింది కానీ వర్కవుట్ కాలేదు. అలాగే ఆమె నాట్యం అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. ఆ లఘు చిత్ర దర్శకుడు రేవంత్ ఇప్పుడు నాట్యం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కూచిపూడి డాన్సర్‌గానే కాకుండా టాలీవుడ్‌లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన సంధ్యా రాజు ‘నాట్యం’ సినిమాతో హీరోయిన్ గా మారింది. రేవంత్ కొరుకొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాకి ర‌చ‌న‌, దర్శకత్వం వహించడంతో పాటు డిఓపి, ఎడిటర్ కూడా ఆయనే. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఆధిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబి దేవ‌న ఇతర పాత్రల్లో నటించారు.

Also Read : Radhe Shyam : కేవలం క్లైమాక్స్ కోసమే 50 కోట్లా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి