iDreamPost

ప్రేక్షకులకు సినిమా డే గందరగోళం

ప్రేక్షకులకు సినిమా డే గందరగోళం

గత వారం 16న నేషనల్ సినిమా డేగా ప్రకటించి ఆ రోజు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా మల్టీప్లెక్సుల స్క్రీన్ల టికెట్ ధర కేవలం 75 రూపాయలకే అమ్ముతామని చెప్పిన సంగతి గుర్తుందిగా. ఆ తర్వాత పైకి ఏవో కారణాలు చెప్పి బ్రహ్మాస్త్ర రెవిన్యూ కోసం దాన్ని తిరిగి 23కి వాయిదా వేయడం మూవీ లవర్స్ మర్చిపోలేరు. కానీ చాలా చోట్ల దానికి సంబంధించిన సూచలనలేమి కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ డేట్ కి రిలీజ్ కాబోతున్న కృష్ణ వృందా విహారి, అల్లూరి, దొంగలున్నారు జాగ్రత్తలకు హైదరాబాద్ లో ఎప్పటిలాగే నార్మల్ రేటే ఉండగా పాత అవతార్ కొత్త రీ రిలీజ్ కు ఏకంగా 325 రూపాయలు పెట్టడంతో అందరూ షాక్ తింటున్నారు

ఇప్పుడు ఈ స్కీం లో చాలా కీలకమైన మార్పులు చేశారట. అన్ని మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ ఉండదని ముఖ్యంగా పివిఆర్ కు చెందిన భాగ్యనగరం, చెన్నై, కోయంబతూర్, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఈ వెసులుబాటు ఉండదట. మిగిలినవి కూడా ఫాలో అవుతాయో లేదో చెప్పలేం. పేటీఎం, బుక్ మై షోలు చూస్తే ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇంతోటి దానికి అంత పబ్లిసిటీ చేసి నేషనల్ సినిమా డే అని ఎందుకు ఊదరగొట్టారని ప్రేక్షకుల ఫిర్యాదు. ఒకవేళ ఇది నిజంగా చేసుంటే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా అన్నీ ఫుల్ అయ్యే అరుదైన దృశ్యాన్ని చూసేవాళ్ళం. అలా కాకుండా కండీషన్స్ అప్లై అనుకున్నప్పుడు అదేదో ముందే క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది

ఇంకో మూడు రోజులే ఉన్న నేపథ్యంలో ఈ గందరగోళం తీరుస్తారో లేదో చూడాలి. హఠాత్తుగా ఫిక్స్ అయ్యారు కానీ నిజానికి ఇలా చేయడం మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ కు అంతగా ఇష్టం ఉన్నట్టు లేదు. రెండు సార్లు అఫీషియల్ గా ఇచ్చిన ప్రెస్ నోట్లో పైన చెప్పిన ట్విస్టులేవి ప్రస్తావించలేదు. తీరా ఇప్పుడు చూస్తే అన్ని చోట్ల 75 రూపాయలు కాదంటున్నారు. అమెరికా తదితర దేశాల్లో మొదటి వారంలోనే నేషనల్ సినిమా డేని పాటించేసి లక్షకు పైగా అదనంగా ఫుట్ ఫాల్స్ తెచ్చుకుని పధకాన్ని సూపర్ హిట్ చేశారు. మనదగ్గరేమో ఇలా బోలెడు మెలికలు పెడుతున్నారు. ఇంత కన్ఫ్యూజన్ లేకుండా ఒక లిస్టు రిలీజ్ చేస్తే ఆడియన్స్ కు సౌకర్యంగా ఉంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి