iDreamPost

మారిన ఆళ్లగడ్డ లెక్కలు.. YCPలోకి భూమా అఖిలప్రియ సోదరుడు

  • Published Mar 05, 2024 | 9:14 AMUpdated Mar 05, 2024 | 9:14 AM

Bhuma Kishore Reddy: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆళ్లగడ్డలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. భూమా కిశోర్‌ రెడ్డి వైసీపీలో చేరారు. ఆ వివరాలు..

Bhuma Kishore Reddy: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆళ్లగడ్డలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. భూమా కిశోర్‌ రెడ్డి వైసీపీలో చేరారు. ఆ వివరాలు..

  • Published Mar 05, 2024 | 9:14 AMUpdated Mar 05, 2024 | 9:14 AM
మారిన ఆళ్లగడ్డ లెక్కలు.. YCPలోకి భూమా అఖిలప్రియ సోదరుడు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఎన్నికల కదనరంగంలో దూసుకుపోతుండగా.. విపక్ష కూటమి పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. అసలు అభ్యర్థుల జాబితాయే ఒక కొలిక్కి రాలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పోటీ చేయబోయే స్థానం గురించే ఇంకా స్పష్టత రాలేదు అంటే కూటమి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పొత్తుల వల్ల టీడీపీలో సీనియర్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. జనసేన కోసం వారిని పక్కకు పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంతేకాక జనసేనలో కూడా అసంతృప్తులు అదే స్థాయిలో ఉన్నాయి. దాంతో చాలా చోట్ల టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలానే వలసలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆళ్లగడ్డలో కీలకంగా ఉన్న భూమా ఫ్యామిలీ నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి.. అధికార వైసీపీలో చేరారు. ఆ వివరాలు.. ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జ్ భూమా కిశోర్‌ రెడ్డి తాజాగా వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే ఏపీసీసీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు జెట్టి గురునాథ రావు కూడా అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వారికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక కిశోర్‌ రెడ్డితోపాటు భూమా వీరభద్రా రెడ్డి, గంధం భాస్కర రెడ్డి, అంబటి మహేశ్వర రెడ్డి తదితరులు.. గురునాథరావుతోపాటు జంగారెడ్డిగూడెం మాజీ జడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్‌ చేరారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు పీవీ మిథున్‌ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిశోర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ.. టీడీపీకి సీ పార్టీలా తయారైందని.. ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేస్తానని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు నచ్చి పార్టీలో చేరాను అన్నారు. అంతేకాక ఆళ్లగడ్డ అభ్యర్థిగా గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాని కిశోర్‌ రెడ్డి స్పష్టం చేశారు. పెత్తందార్లను ఎదిరించి నిలబడ్డ నేతలుగా భూమా దంపతులు పేరు గడించారని.. కానీ వారి కడుపున పుట్టిన అఖిల ప్రియ ఆళ్లగడ్డలో అరాచకశక్తిగా మారారు అంటే ఆమెపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాక అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటామని.. భూమా బంధువర్గం అంతా అఖిలప్రియకు దూరంగా జరిగారు అని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించటం ఖాయమని కిశోర్‌ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి