iDreamPost

ప్రచారం ముగిసింది.. టెన్షన్‌ మొదలైంది..

ప్రచారం ముగిసింది.. టెన్షన్‌ మొదలైంది..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన ప్రచారం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. మరో 36 గంటల తర్వాత పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరగబోతోంది. పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికల్లో బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే యంత్రాంగ పోలింగ్‌కు అంతా సిద్ధం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 109 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు ఉన్నాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 29 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదు. ప్రస్తుతం 75 మున్సిపాలిటీల్లో పోరు జరుగుతోంది. కాకినాడ కార్పొరేషన్‌ పాలక మండలికి గడువు ఉండడం, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం కార్పొరేషన్లకు సంబంధించి కోర్టు కేసులు ఉండడంతో అక్కడ నగర పోరు సాగడం లేదు. మొత్తంతో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

12 కార్పొరేషన్లలోని 671 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 89 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 582 డివిజన్లకు పోలింగ్‌ జరగబోతోంది. చిత్తూరు కార్పొరేషన్‌లో పాలక వర్గం ఏర్పాటుకు అవసరమైన స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో మేయర్‌ పీఠం వైసీపీ ఖాతాలో పడింది.

75 మున్సిపాలిటీల్లోని 2,123 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 479 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా వైసీపీ 470 వార్డులను గెలుచుకుంది. టీడీపీ ఆరు, బీజేపీ ఒకటి, స్వతంత్రులు రెండు వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మెజారిటీ వార్డులు ఏకగ్రీవం కావడంతో పోలింగ్‌కు ముందే 12 మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాయచోట, పలమనేరు, ఆత్మకూరు. నాయుడుపేట, సూళ్లూరుపేట, కొవ్వూరు, డోన్, తుని మున్సిపాలిటీలను కూడా పోలింగ్‌కు ముందే వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.

పంచాయతీ ఎన్నికల్లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న వైసీపీ మున్సిపల్‌ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ తరఫున స్థానిక మంత్రులు అభ్యర్థులతో కలసి ఇంటింట ప్రచారం చేశారు. టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణలు ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. పురపోరులో జనసేన పోటీ చేస్తున్నా.. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారానికి రాలేదు. ప్రచారంలో చేసినా.. ఓట్లు రాలుతాయా..? లేదా..? అన్న టెన్షన్‌ అభ్యర్థుల్లో నెలకొంది.

12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి దృష్టి నాలుగు కార్పొరేషన్లపైనే కేద్రీకృతమైంది. కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నాలుగు కార్పొరేషన్లలో దాదాపు అన్ని వార్డుల్లోనూ పోటీ నెలకొనడం టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో తెలుపుతోంది. మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత జగన్‌ సర్కార్‌ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. ఈ నాలుగు కార్పొరేషన్లలో గెలుపోటముల ఆధారంగా మూడు రాజధానులు, అమరావతి రాజధాని రాజకీయం సాగబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి