క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. టీ20 క్రికెట్కు ఇంతగా క్రేజ్ పెరగడానికి కారణం ఐపీఎల్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లీగ్ నిర్వహణతో అటు బీసీసీఐ ఖజానా నిండటమే గాక ఇటు ఆటగాళ్ల పైనా కాసుల వర్షం కురిసింది. భారత క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో మెజారిటీ పర్సెంటేజ్ ఈ లీగ్ నుంచే వస్తోందని తెలుస్తోంది. అలాంటి ఈ లీగ్లో బాగా క్రేజ్ ఉన్న జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ కప్ను ఐదు సార్లు చేతపట్టిన సీఎస్కేకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దానికి గల కారణాల్లో ఒకటి మహేంద్ర సింగ్ ధోని సారథ్యం.
చెన్నై కప్స్ గెలవడంలోనూ, ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకోవడంలోనూ ధోని పాత్ర ఎంతగానో ఉంది. జట్టులో పెద్దగా స్టార్ ప్లేయర్లు లేకపోయినా సీనియర్లు, జూనియర్లను కలుపుకొని టీమ్ను ముందుకు తీసుకెళ్తున్నాడు ధోని. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని సీఎస్కే చేజిక్కించుకోవడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు. అయితే మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీకి.. వయసు కూడా ఒక సమస్యగా మారింది. అతడు ఇంకెంత కాలం ఆడతాడో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. గాయానికి సర్జరీ చేయించుకున్న ధోని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. వచ్చే ఐపీఎల్లో ధోని ఆడతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో చెన్నై తదుపరి కెప్టెన్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.
సీఎస్కే కెప్టెన్సీ అంశంపై ఆ టీమ్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. చెన్నై నెక్స్ట్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అవుతాడని రాయుడు అన్నాడు. గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడని.. అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రాయుడు పేర్కొన్నాడు. ధోని మరో సీజన్ ఆడే ఛాన్స్ ఉందని.. కాబట్టి భవిష్యత్తులో రుతురాజ్ కచ్చితంగా చెన్నై సారథి అవుతాడని చెప్పుకొచ్చాడు. రాబోయే 7 నుంచి 8 ఏళ్ల పాటు సీఎస్కేకు కెప్టెన్గా రుతురాజ్ ఉండే అవకాశం ఉందని.. అతడు ఇప్పటికే ధోని, హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలో రాటుదేలాడని రాయుడు వివరించాడు. మరి.. చెన్నై నెక్స్ట్ కెప్టెన్ రుతురాజ్ అంటూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.