iDreamPost

ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైపోయింది. సార్వత్రిక ఎన్నికలకు 9 నెలల సమయం ఉన్న వేళ అధికార పార్టీ రాజ్యసభ్యుడు విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథంలో పరుగులు పెడుతోందని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. మంచి గణాంకాలను నమోదు చేస్తోంది అన్నారు.

“సాధారణంగా ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టిన సంవత్సరం ఏ ప్రభుత్వంలో అయినా ఆందోళనకర వాతావరణం కనిపిస్తుంది. కానీ, ఏపీ ప్రభుత్వంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రివర్గం, పార్టీ శ్రేణులు సహా కార్యకర్తలు సైతం పూర్తి విశ్వాసంతో ఉన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశాం. రాష్ట్రం 11.23 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని రంగాల్లో మార్పుల వల్లే ఇది సాధ్యం అయింది. అనేక సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారులకు 1.97 లక్షల కోట్లు అందజేశాం. ఇది సరికొత్త రికార్డుగా ఉంది.

రాష్ట్రానికి కొత్తగా 17 వైద్య కళాశాలలు రాబోతున్నాయి. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. కోస్తాతీరం పొడవునా పారిశ్రామిక కారిడార్ నిర్మితమవుతోంది. వైజాగ్- చెన్నై పారిశ్రామిక కారిడార్ పూర్తయితే సౌత్ లోనే ఏపీ అత్యుత్తమ కేంద్రంగా మారుతుంది. అభివృద్ధి అనేది ఒకే దగ్గర కాకుండా వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి. రాష్ట్రంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంఖ్య 1.56 లక్షలకు చేరింది. 2019లో వీటి సంఖ్య 1.10 లక్షలుగా మాత్రమే ఉంది. ఇంకా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రం సంక్షేమాభివృద్ధి లో పరుగులు పెడుతోంది” అంటూ విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి