iDreamPost

ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్..

ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్..

నేటి ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వైరస్‌ నియంత్రణపై చర్చించనున్నారు.దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అంశంపై సీఎంలతో ప్రధాని చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వారు చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.దేశంలో రెండు విడతలుగా మే 3 వరకు 40 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ గడువు మరో వారం రోజులలో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి గతంలో రెండు సార్లు ప్రధాని సీఎంలతో చర్చించారు. తొలుత మార్చి 20న చర్చించి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు.కరోనా నేపథ్యంలో రెండోసారి ఏప్రిల్‌ 11న సీఎంలతో మాట్లాడిన ప్రధాని రాష్ట్రాలలో కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు,వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు.ఆ సమావేశంలోనే లాక్‌డౌన్‌ పొడిగింపుపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

మెజారిటీ ముఖ్యమంత్రులు ముఖ్యంగా తెలంగాణ, పంజాబ్ సీఎంలు ఆనాడు లాక్‌డౌన్‌ పొడిగింపునకే మొగ్గు చూపారు.దీంతో లాక్‌డౌన్‌ను మరో 19 రోజులపాటు మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.కాగా మరో వారం వ్యవధిలో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ మూడోసారి సీఎంలతో ప్రధాని మాట్లాడుతున్నారు.ఇప్పటికే హాట్ స్పాట్ లు కానీ క్లస్టర్లలో కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు రంగాల వారీగా లాక్‌డౌన్‌ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చాయి.

నేటి సమావేశంలో కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చే వరకు మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని పలు రాష్ట్రాలు కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని ఆదివారం తన మన్‌కీబాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనాపై యుద్ధం మధ్యలో ఉన్నామని,ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.లాక్‌డౌన్‌తో దేశంలో స్తంభించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు లెక్కించడానికి మరికొన్ని సడలింపులు రాష్ట్రాలు కోరుకుంటున్నా వేళ ప్రధాని చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.వివిధ రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగింపు ఉండే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.అయితే నేటి సమావేశానంతరం లాక్‌డౌన్‌ పొడిగింపుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి