iDreamPost

మూడు ప్రాంతాల్లో మినీ సచివాలయాలు: ఎంపీ డిమాండ్

మూడు ప్రాంతాల్లో మినీ సచివాలయాలు: ఎంపీ డిమాండ్

మూడు ప్రాంతాల్లో మినీ సచివాలయాలు ఏర్పాటు చేస్తే బావుంటుందని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు. దిల్లీలో మీడియాతో టీజీ మాట్లాడారు. మూడు ప్రాంతాలకు లాభం చేకూరేలా సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాయలసీమలో శీతాకాల రాజధాని పెట్టాలని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచీ అడుగుతున్నామని గుర్తు చేశారు. అమరావతి ఫ్రీజోన్‌ కాకపోవడంతో రాయలసీమ వాళ్లకు అక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేసేవరకు పోరాటం చేస్తామని చెప్పారు.

హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ఎలా అన్నారో.. మినీ సచివాలయం కూడా అలాగే ఏర్పాటు చేయాలని టీజీ డిమాండ్‌ చేశారు. పూర్తిగా విశాఖలోనే సచివాలయం పెడతామంటే తాము ఒప్పుకోబోమన్నారు. రాయలసీమ ప్రజలు విశాఖ వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నారు. అమరావతి అంటేనే ఇబ్బందిగా ఉండేదని.. అలాంటి విశాఖ అంటే ఒప్పుకునేదిలేదన్నారు. మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తాయని.. వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి