iDreamPost

మద్యం దుకాణాల తెరుస్తారంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్టు…

మద్యం దుకాణాల తెరుస్తారంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్టు…

కరోనా మహమ్మారి వ్యాపిస్తుండడంతో మద్యం దుకాణాలను మూసేయ్యాలి అంటూ తెలంగాణ సర్కారు మార్చి 22 న ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలంగాణలో మద్యం దుకాణాలను తిరిగి తెరస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారుల పేరుతో నకిలీ జీవోను సృష్టించి కలకలం సృష్టించిన వ్యక్తిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళ్తే కె.సనీష్‌కుమార్‌ అనే వ్యక్తి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.తెలంగాణలో మద్యం దుకాణాలు మూసి వేయడంతో మద్యం దుకాణాల యజమాని అయిన తన స్నేహితుడికి లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణా లో మద్యం దుకాణాలను తిరిగి తెరుస్తున్నట్లు ఒక నకిలీ జీవోను సృష్టించి వాట్సాప్ ద్వారా తన స్నేహితుడికి పంపించాడు. స్నేహితులు ద్వారా మరి కొంతమందికి ఈ నకిలీ జీవో వార్త చేరడంతో కొన్ని గంటల్లోనే వందల గ్రూపుల్లో వైరల్ అయ్యింది.

నిజంగా మద్యం దుకాణాలు తెరుస్తారా అంటూ ఆబ్కారీ శాఖ అధికారులకు ఫోన్లు రావడంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు. దాంతో ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టి 48 గంటల్లో నిందితులను గుర్తించారు. సనీష్‌ కుమార్‌ అలియాస్‌ సన్నీ నకిలీ జీవోను సృష్టించారని తెలిపే సాక్ష్యాలను సేకరించి మంగళవారం జైలుకు తరలించారు. వాట్సాప్ ఫేస్బుక్ లలో ఫార్వర్డ్ అయ్యే వదంతులను నమ్మవద్దని, ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడిస్తుందని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి