Idream media
Idream media
అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ను సీబీఐ అరెస్టు చేసింది. స్థానిక జేజే ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయిన ఆయనను ప్రత్యేక న్యాయమూర్తి వీసీ బార్డే ఎదుట సీబీఐ బుధవారం హాజరుపరిచింది. కేసు విచారించిన న్యాయమూర్తి.. ఈనెల 11 వరకు దేశ్ముఖ్ను సీబీఐ కస్టడీలోకి ఇస్తున్నట్టు ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు దేశ్ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పలాండేను కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీలోకి తీసుకుంది.
మరోవైపు, పోలీసు ఇన్స్పెక్టర్ సచిన్ వజేను డిస్మిస్ చేసింది. కాగా, అవినీతి కేసులో తన కస్టడీని కోరుతూ సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడాన్ని దేశ్ముఖ్ బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఆయన పిటిషన్ను స్వీకరించేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించింది. కాగా, అంతకుముందు దేశ్ముఖ్ పిటిషన్ను విచారించబోమంటూ బెంచ్ నుంచి జస్టిస్ రేవతి మొహితే దెరె తప్పుకున్నారు. ఆ తర్వాత దేశ్ముఖ్ పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలంటూ ఆయన తరపు లాయర్ అనికేత్ నికమ్… జస్టిస్ పీడీ నాయక్ను అభ్యర్థించారు. ఆయన కూడా పిటిషన్ను విచారణ జరిపేందుకు ఆసక్తి చూపించక తప్పుకున్నారు. అయితే తాము ఎందుకు బెంచ్ నుంచి తప్పుకున్నారో ఇద్దరు న్యాయమూర్తులూ కారణాలను వెల్లడించలేదు.
కాగా, సీబీఐ కేసులో ఇద్దరు నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ దేశ్ముఖ్ ఉద్దేశపూర్వకంగానే కస్టడీని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా సీబీఐ ఆరోపించింది. అందుకోసమే ఆయన ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జేజే ఆస్పత్రిలో చేరారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కాగా, మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ముఖ్ను ఈడీ గత ఏడాది నవంబరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, మరొక అవినీతి కేసులో దేశ్ముఖ్ను కస్టడీలోకి తీసుకునేందుకు బాంబే హైకోర్టు గతవారం సీబీఐకి అనుమతించింది.
నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులకు హోంమంత్రిగా ఉన్నప్పుడు దేశ్ముఖ్ టార్గెట్ విధించారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ్ముఖ్పై కేసు నమోదు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించడంతో గత ఏడాది ఏప్రిల్లో దేశ్ముఖ్ మంత్రిపదవికి రాజీనామా చేశారు.