iDreamPost

8 ఏళ్లుగా ప్రేమ! పెళ్ళికి నెల రోజుల ముందు కోమాలోకి!

8 ఏళ్లుగా ప్రేమ! పెళ్ళికి నెల రోజుల ముందు కోమాలోకి!

ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ అనేది దొరకడం చాలా అరుదు. ప్రేమ కూడా కమర్షియల్ రంగులు అద్దుకుంది. కేవలం తమ అవసరాలు తీర్చుకునేందుకు ప్రేమ అని ముసుగు కప్పుకుంటున్నారు నేటి ప్రేమికులు. సినిమాలు, షికార్లు, షాపింగ్స్ అంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాక.. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి కుల మతాల, ఆస్తి అంతస్తుల అడ్డుగోడలు, తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, సెటిల్ కాలేదన్న కారణాలతో దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ప్రేమ కథ.. చాలా మంది ప్రేమికుల కళ్లు తెరిపించడమే కాదూ.. ఆదర్శంగా నిలుస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిజమైన ప్రేమకు నిలువటద్దం ఆ జంట.

వివరాల్లోకి వెళితే.. హితేన్, వ్రీని ఖన్నా ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే విధి వీరిపై పగబట్టింది. పెళ్లికి ఒక నెల రోజుల ముందు.. హితేన్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలైన అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. మెదడుకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోగా.. అతడి తిరిగి కోలుకుంటాడని చెప్పలేమని తేల్చి చెప్పారు వైద్యులు. అయినప్పటికీ ఆమెకు తమ ప్రేమపై నమ్మకం ఉంది. అతడు తిరిగి మామూలు మనిషి అవుతాడన్న విశ్వాసం వ్యక్తం చేయడంతో వైద్యులు అతడికి చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఆమె అనుకున్నట్లుగా మూడు నెలల తర్వాత కోమాలో నుండి బయటకు వచ్చాడు.

ఆ మూడు నెలల కాలంలో అతడు సుమారు 30 కిలోల బరువు తగ్గిపోయాడు. అంతటితోనే కథ సుఖాంతం కాలేదు. కోమాలో నుండి బయటకు వచ్చాడు కానీ పూర్తిగా కోలుకోలేదు. వ్రీని చుట్టూ ప్రక్కల ఉన్నవారు హితేష్‌ను వివాహం చేసుకోవద్దని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. అతడికి సపర్యలు చేస్తూ.. తిరిగి మామూలు మనిషిగా మార్చేందుకు శ్రమించింది. ఇద్దరు కలిసి సమస్యలను ఎదురించడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు హితేన్ శారీరకంగా, మానసికంగా కోలుకోవడంతో గత ఏడాది జూలై 6 న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇదంతా తమ ప్రేమ ప్రయాణం పేరుతో వ్రీని తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by People of India (@officialpeopleofindia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి