ఒక పక్క రాజధాని అంశంపై తెలుగుదేశం నేతలు ఆందోళనలు చేస్తున్న సమయంలో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు మద్దాలి గిరి టీడీపీని వీడి జగన్కు జై కొట్టారు. అయితే రెండు రోజుల ముందు వరకు చంద్రబాబు వెంటే ఉన్న మద్దాలి గిరిధర్ కనీసం తనతో క్లోజ్ గా ఉండే ముఖ్యులకు సైతం చెప్పకుండా ఒక్కడిగా వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ ని కలవడాన్ని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు.
సోమవారం మధ్యాహ్నం గుంటూరు నగర వైసీపీ సీనియర్ నేత లేళ్ళ అప్పిరెడ్డి ద్వారా తన సామాజికవర్గానికే చెందిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలసి సీఎం జగన్తో భేటీకి అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు. అమరావతి ప్రాంతంలో రాజధానిపై ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో అదే ప్రాంతానికి చెందిన మద్దాళి గిరిధర్ ముఖ్యమంత్రిని కలసిన అనంతరం బయటకి వచ్చిన రాజధానిని పై గిరిధర్ ఆచితూచి స్పందించారు. అధికార వికేంద్రీకరణని సమర్థిస్తున్నానని అదే సమయం లో గుంటూరు నగరం అభివృద్ధి తనకి ముఖ్యమని వ్యాఖ్యానించారు.
సరిగ్గా అమరావతిపై తెలుగుదేశం ఆందోళనలు చేస్తున్న సమయంలోనే మద్దాలి గిరి తెలుగుదేశాన్ని వీడడం రాజధాని ప్రాంతంలో రాజకీయంగా తెలుగుదేశానికి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. అదీకాక ఇప్పటివరకు గుంటూరు విజయవాడ పట్టణాలలోని సాధారణ మధ్యతరగతి ప్రజలనుండి అమరావతికి పెద్దగా మద్దతు లభించడం లేదనే విమర్శ కూడా వుంది. పైగా ఈ రెండు పట్టణాలలోని బలమైన సామాజిక వర్గంగా ఉన్న వైశ్యులలో వెల్లంపల్లి శ్రీనివాస్, మద్దాలి గిరి కి మంచి పట్టు ఉంది. దాంతో సామాజిక కోణంలో కూడా తెలుగుదేశానికి ఇది కొంత ఇబ్బందిగానే భావించవచ్చు.
అయితే మద్దాలి గిరి తాను వైసిపిలోకి అధికారికంగా చేరుతున్నట్టు వెల్లడించనప్పటికీ సీఎం జగన్ను కలిసి నైతిక మద్దతును ప్రకటించడంతో, ఆయన కూడా ఇంతకు ముందు తెలుగుదేశానికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ తరహాలోనే తనని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించమని స్పీకర్ ని కోరే అవకాశం వుంది.
అయితే ఇప్పటికే మద్దాలి గిరి పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంతో చంద్రబాబు నాయకుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్గా కోవెలమూడి రవీంద్ర (నాని) ని నియమించారు. పశ్చిమ ఎమ్మెల్యే గిరి తెలుగుదేశాన్ని వీడతారనే అనుమానంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ మేరకు పశ్చిమ ఇన్చార్జ్గా నానిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కోవెలమూడి రవీంద్ర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 2014 లో ఆయనకు పశ్చిమ టిక్కెట్ ఆశించారు. 2019 ఎన్నికలకు ముందు మోదుగుల పార్టీ మారడంతో ఈ సారి టిక్కెట్ తనకే వస్తుందని నాని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా మరో సారి నానికి అదృష్టం కలిసి రాలేదు. నాని నేపధ్యం చూస్తే ఆయనకి ఒక ప్రముఖ కంపెనీ గ్యాస్ డీలర్షిప్ తో పాటు పెట్రోల్ బంకులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన మీద ఇప్పటికే పలు కోర్టులలో చెక్ బౌన్స్ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్నీ తాత్కాలికంగా ఇన్చార్జ్ గా నియమించినప్పటికీ పలు సమీకరణాలు దృష్యా రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించడం కష్టమేనని చెప్పాలి