iDreamPost

ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు.. కొడాలి నాని కౌంటర్!

ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు.. కొడాలి నాని కౌంటర్!

వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హీరోల రెమ్యూనరేషన్ వివరాలు ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతోందని ప్రశ్నించారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇండస్ట్రీ గురించి దేనికి అంటూ కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేయడం చూశాం. ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించారు. ఇండస్ట్రీకి కూడా కొడాలి నాని పరోక్షంగా చురకలు అంటించారు.

చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నానిని మీడియా ప్రశ్నించగా.. “ఇండస్ట్రీలో కూడా చాలా మంది పకోడీగాళ్లు ఉన్నారు కదా. ప్రభుత్వం ఎలా ఉండాలి అని చాలా పకోడీ గాళ్లు సలహాలు ఇస్తున్నారు కదా. వాళ్లకి కూడా చెప్పాల్సింది కదా. మనకెందుకురా బాబు రాజకీయాలు.. మన డాన్సులెయ్యో మనం చేసుకుందాం. మన ఫైట్లు ఎయ్యో మనం చేసుకుందాం అని సలహా ఇవ్వచ్చు కదా. ఇద్దరికీ సలహా ఇస్తే సరిపోతుంది కాదు?” అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఏం చేశారంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అని చేపట్టిన కార్యక్రమం గురించి కొడాలి నానిని ప్రశ్నించగా.. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యధికకాలం నడిపింది చంద్రబాబే కదా. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రాజక్టులు పూర్తి చేయలేదు. ఆరోజు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు. తెలంగాణలో మహబూబ్ నగర్ ని దత్తత తీసుకుంటున్నాను అన్నావ్. మరి మహబూబ్ నగర్ ని ఎందుకు గాలికి వదిలేశావ్. 27 ఏళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమావా. ఇన్నాళ్లు ఏం చేశావ్? రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగి ఉన్నది నీ వల్ల కాదా? ఈ రాష్ట్రంలో ఉన్న తాగునీటి ప్రాజెక్టులు మెదలు పెట్టిన వ్యక్తి ఎవరు. జలయజ్ఞం చేపట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గడిచిన పదేళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఏం చేశారు? ఇప్పుడు వచ్చి నాకు అధికారం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు” అంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి