iDreamPost

కేర‌ళ గోల్డ్ స్కాం : ఈడీకి ఊర‌ట

కేర‌ళ గోల్డ్ స్కాం : ఈడీకి ఊర‌ట

కేరళ గోల్డ్ స్కామ్ కేసు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ కేసులో ప్ర‌భుత్వ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తున్న త‌రుణంలో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీసుకున్న నిర్ణ‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేకెత్తించింది. ఓ వీడియో ఆధారంగా .. కుంభ‌కోణం కేసు ద‌ర్యాప్తు చేస్తున్న ఈడీపైనే వారు రివ‌ర్స్ కేసు న‌మోదు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ చేత ఈడీ అధికారులు బలవంతంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరును చెప్పించారని వారి ఆరోప‌ణ‌. సాధార‌ణంగా దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేస్తాయి. కేరళలో మాత్రం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌పైనే కేసు న‌మోదు చేశారు. దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా న్యాయ‌స్థానంలో ఊర‌ట ల‌భించింది.

కేరళలో వెలుగు చూసిన హవాలా కేసు ద‌ర్యాప్తులో భాగంగా.. నిందితురాలు స్వప్న సురేశ్‌ను ఈడీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ప్రశ్నించారు. ఆ సంద‌ర్భంగా సీఎం పినరయి విజయన్‌ను ఇరికించే ఉద్దేశంతో ఆయన పేరును చెప్పే విధంగా స్వప్నను బెదిరించారని కేర‌ళ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఈ విషయంలో ఈడీ అధికారులు కుట్ర, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. సీఎం కు హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు దస్తావేజును తయారు చేశారని ఆరోపించింది. అలాగే, ముఖ్యమంత్రి విజయన్ వద్ద గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన ఎం శివశంకర్‌తో కలిసి తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళినట్లు అంగీకరించాలని తనను ఈడీ అధికారులు ఒత్తిడి చేశారని స్వప్న ఆరోపించారు. ముఖ్యమంత్రి కోసం ఆర్థిక చర్చలు జరిపేందుకు శివశంకర్‌తో కలిసి తాను యూఏఈ వెళ్ళినట్లు అంగీకరించాలని, సీఎం విజయన్‌తోపాటు మరికొందరు మంత్రుల పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

శివశంకర్ కూడా బంగారం అక్రమ రవాణా కేసులో నిందితుడే. మరొక నిందితుడు సందీప్ నాయర్ ఎర్నాకుళం జిల్లా కోర్టుకు లేఖ రాశారు. బంగారం అక్రమ రవాణా కేసులో ముఖ్యమంత్రి విజయన్ పేరు చెప్పాలని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. వీరిద్దరి ఆరోపణలపైనా కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 167 (హాని చేయాలనే ఉద్దేశంతో సరైనది కానటువంటి పత్రాన్ని ప్రభుత్వాధికారి రూపొందించడం), 192 (తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం), 195-ఏ (తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని ఏ వ్యక్తినైనా బెదిరించడం) ప్రకారం ఈడీ అధికారులపై కేసులు నమోదు చేశారు.

ఆ కేసుల‌కు సంబంధించి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఒత్తిడి చేసినట్లు నమోదైన రెండు కేసులను హైకోర్టు రద్దు చేసింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నేరాన్ని అంగీకరించాలని అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. తమ శాఖ అధికారులపై నమోదైన కేసులను రద్దు చేయాలని, లేదా, సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు చేయించాలని ఈడీ కోరింది. కేరళ పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు ఓ ప్రహసనమని ఆరోపించింది.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం (ఈడీ) అధికారులపై నమోదైన రెండు కేసులను రద్దు చేసింది. 30 కేజీల బంగారం అక్రమ రవాణా కేసులో స్వ‌ప్న ప్ర‌ధాన నిందితురాలు. ఆమె కేరళలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగిని. స్కాంలోని బంగారం విలువ రూ.14.82 కోట్లు ఉంటుంది. ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసుపై ఈడీ, కస్టమ్స్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పుడు కేసులు ర‌ద్దు కావ‌డంతో ఈడీ విచార‌ణ‌లో మ‌రింత దూకుడు పెంచ‌నుంది.

Also Read : దేశమంతటా కరోనా కల్లోలం, కేంద్రం స్పందన కోసం ఎదురుచూపులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి