iDreamPost

అత్యుత్తమ ప్రమాణాలతో చరిత్ర సృష్టించబోతున్న 108, 104 సర్వీసులు

అత్యుత్తమ ప్రమాణాలతో చరిత్ర సృష్టించబోతున్న 108, 104 సర్వీసులు

ఒక చిరుద్యోగి ఆఫీసుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు కానీ 108 సకాలంలో చేరుకుని ఆయన ప్రాణాన్ని నిలబెట్టింది. ఒక కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడింది.

పట్నంకి దూరంగా మారూమూల పల్లెలో ఒక నిండు గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుంది. పెద్దాసుపత్రికి వెళితే కానీ రక్షించడం కష్టం అన్నారు. ఇంతలో 108 వచ్చి ఆమెని ఆసుపత్రిలో చేర్చింది. సకాలంలో రావడం వలన తల్లీ బిడ్డా క్షేమం. కుటుంబం అంతా సంతోషంతో నిండిపోయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి గారు 2005 ఆగస్టులో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సర్వీసు సమాచారం అందిన నిమషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక వైద్యం అందించడంతోపాటు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చి కొన్ని లక్షలమంది ప్రాణాలు కాపాడి ఒక రకంగా రాష్ట్రంలో ఆరోగ్య విప్లవాన్నే సృష్టించి ఇతర రాష్ట్రాలకి మార్గదర్శంగా నిలిచాయి.

అయితే వై.యస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తరువాత వచ్చిన కాంగ్రెస్ పాలకులు అంబులెన్స్ నిర్వాహణపై తగిన శ్రద్ధ చూపకపోయేసరికి అపరసంజీవనికి కష్టాలు మొదలయ్యాయి. ఇక 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంజీవనిగా పేరొందిన 108,104 సర్వీసుల వ్యవస్థ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య ధోరణితో పూర్తిగా గాడి తప్పింది. వాహనాల్లో ఉపయోగించాల్సిన మందులు, వస్తువుల లో నాణ్యత పాటించలేదు, అంబులెన్సులకు సకాలంలో మరమత్తులు చేయక రోడ్డుపై పరుగులు పెడుతూ ప్రాణాలు కాపాడాల్సిన సర్వీసు మెకానిక్ గ్యారేజీకే పరిమితం అయ్యాయి. ఇక అంబులెన్సు సర్వీసులో పనిచేసే ఉద్యోగుల సంగతికి వస్తే ఒక్కరికి కూడా చాలిన జీతం ఇవ్వకపోగా ఇచ్చే అరకొర జీతాలు కూడా సకాలంలో చెల్లించకుండా ఉద్యోగుల జీవితాలతో ఆటలు ఆడేవారు. దీంతో సకాలంలో 108 సర్వీసులకు నోచుకోక అనేకమంది మృత్యువాత పడటం మార్గమధ్యంలో డీజిల్ అయిపోవడంతో అంబులెన్సులోనే ప్రసవించడం లాంటి అనేక ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.

దీంతో నాటి ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షనేత గా ఉన్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేసిన పాదయాత్రలో వై.యస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 అంబులెన్సుల పనితీరుపై అనేక ఫిర్యాదులు ప్రజల నుండి రావడం, అలాగే 108 ఉద్యోగస్తులు పడుతున్న ఇబ్బందులు వారు నేరుగా జగన్ గారికే మొరపెట్టుకోవడంతో , తాను అధికారంలోకి రాగానే 108 అంబులన్సులను ఇప్పుడున్న వాటికన్నా ఇంకా మెరుగ్గా సాంకేతికంగా అత్యుత్తమ ప్రమాణాలతో నడిచేలా చేస్తాం అని, అలాగే ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Also Read: ప్రజలను రక్షించే 108 సర్వీస్ పై టీడీపి విషప్రచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడు ఎవ్వరూ చూడని విధంగా అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వెంటనే తన తండ్రి వై.యస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక అయిన 108 అంబులెన్సుల పనితీరును హామీ ఇచ్చిన విధంగానే పూర్తిగా ప్రక్షాళణ చేయటానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. తొలుత హామీ ఇచ్చినట్టుగానే వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు, ప్రస్తుతం 108 వాహనాల్లో 2 వేలమందికిపైగా పనిచేస్తున్నారు , వీరిలో పైలెట్‌(డ్రైవర్‌)కు గతంలో రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)కి గతంలో రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే 104 వాహనాల్లో సుమారు 1,500 మంది ఉద్యోగులు ఉండగా , వీరిలో ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు నూతనంగా రాష్ట్రంలో అంబులెన్సుల సామర్ధ్యం 1060 కి పెంచి రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న అన్ని మండల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే గతంతో పోలిస్తే రాబోతున్న అంబులెన్సుల్లో అంతర్జాతియ వైద్య ప్రమాణాలు పాటిస్తు అనేక కొత్త పరికరాలు ఏర్పాటు చేశారు.

నూతనంగా రాబోతున్న అంబులెన్సులో సదుపాయాలు చూస్తే ఎన్నెన్నో ప్రత్యేకతలు కనపడుతున్నాయి. జులై 1న ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభం అవుతున్న ఈ వాహనాలు లో పల్సాక్సీ మీటర్‌, మల్టీపారా మానిటర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌ , సక్షన్‌ ఆపరేటర్‌, ఫోల్డబుల్‌ స్ట్రెచర్స్‌, సిరంజి పంపు, కొత్తగా చిన్నారులకోసం నియోనేటల్ అంబులెన్సులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి అనుసంధానం అయ్యేలా 104 వాహనాలు, అంబులెన్సులోనే 9 రకాల రక్త పరీక్షలు, 20 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ వాహనాన్ని విలేజ్ క్లినిక్ లకు అనుసంధానం చేయడం ఈ అంబులెన్సులు గ్రామీణ ప్రాంతాలకి 20 నిమిషాల్లో పట్టణ ప్రాంతంలో 15 నిమిషాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో 25 నిమిషాలో వ్యవధిలో చేరుకునేలా తిరిగి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్ చేతుల్లో ప్రాణం పోసుకుని వస్తున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో ప్రాణం పోసుకుని ఆపత్కాలంలో సాయం అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని కాపాడటానికి నిమిషాల వ్యవధిలో కుయ్..కుయ్..కుయ్ అంటు వచ్చి ప్రజల ప్రాణాలను నిలిపి దేశవ్యాప్తంగా మన్ననలు పొందిన 108 సర్వీసు తిరిగి ఆయన తనయుడు అయిన ముఖ్యమంత్రి వై.యస్ జగన్ గారి చేతుల మీదగా అత్యుత్తమ ప్రమాణాలతో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సరికొత్త హంగులతో రాబోతున్న అంబులెన్సు సర్వీసు కూడా నాటిలాగే దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చరిత్ర సృష్టించే సేవలు అందిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి