iDreamPost

మాజీ మంత్రి నారాయణ​కు సీఐడీ నోటీసులు.. లోకేష్‌తో కలిపి విచారణ

  • Published Oct 02, 2023 | 12:00 PMUpdated Oct 02, 2023 | 12:00 PM
  • Published Oct 02, 2023 | 12:00 PMUpdated Oct 02, 2023 | 12:00 PM
మాజీ మంత్రి నారాయణ​కు సీఐడీ నోటీసులు.. లోకేష్‌తో కలిపి విచారణ

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు భారీ షాక్‌ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే.. విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసుకు సంబంధించి.. ఏపీ సీఐడీ తాజాగా మాజీ మంత్రి నారాయణకు నోటీసులు పంపింది. అక్టోబర్‌ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో స్పష్టం చేసింది. అంతేకాక ఈ కేసులో లోకేష్‌తో కలిసి నారాయణ.. విచారణకు హాజరు కావాలని సీఐడీ ఆదేశించింది.

అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు స్కామ్‌లో ఏ2గా ఉన్న నారాయణ.. ఇప్పటికే.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ మీద బయట ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచడంతో.. అరెస్టుకి భయపడి ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు నారాయణ. అయితే ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే లోపే.. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో.. నారాయణకు కూడా కీలక పాత్ర ఉందని నిర్ధారించుకున్న సీఐడీ.. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది.

ఇక ఈ కేసులో అక్టోబర్‌ 4వ తేదీన నారా లోకేష్‌ను తమ ఎదుట హాజరు కావాలని స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. ఇప్పుడు అదే తేదీన నారాయణ విచారణ చేపడుతుండడం గమనార్హం. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు స్కామ్‌ కేసులో.. ఈ ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉంది అంటున్నారు.

చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఐడీ దర్యాప్తులో.. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ పేరిట జరిగిన భారీ అవినీతి వెలుగు చూసింది. దాంతో సీఐడీ ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది. ఇప్పటికే చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్ట్‌ అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి