iDreamPost

IND vs SA: గెలిచిన జోష్​లో తప్పులు మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా సిరీస్ నేర్పిన పాఠాలు!

  • Published Jan 05, 2024 | 7:44 PMUpdated Jan 05, 2024 | 7:44 PM

దాదాపు నెల రోజుల పాటు జరిగిన సఫారీ టూర్​ టీమిండియాకు అనేక పాఠాలు నేర్పింది. ఈ పర్యటనలో ఘన విజయాలతో పాటు ఘోర పరాభవాలనూ ఎదుర్కొంది భారత్. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

దాదాపు నెల రోజుల పాటు జరిగిన సఫారీ టూర్​ టీమిండియాకు అనేక పాఠాలు నేర్పింది. ఈ పర్యటనలో ఘన విజయాలతో పాటు ఘోర పరాభవాలనూ ఎదుర్కొంది భారత్. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 05, 2024 | 7:44 PMUpdated Jan 05, 2024 | 7:44 PM
IND vs SA: గెలిచిన జోష్​లో తప్పులు మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా సిరీస్ నేర్పిన పాఠాలు!

క్రికెట్​లో ప్రతి టోర్నమెంట్, ప్రతి మ్యాచ్ ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ తర్వాత సఫారీ టూర్​కు బయల్దేరిన టీమిండియా ఈ నెల రోజుల్లో చాలా విషయాలను ఎక్స్​పీరియెన్స్ చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20, టెస్టు సిరీస్​లను సమం చేసిన భారత జట్టు.. వన్డే సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ పర్యటనలో చాలా మంది యువ ఆటగాళ్లను పరీక్షించింది భారత్. వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రాలు తొలిసారి సౌతాఫ్రికా సిరీస్​లోనే ఆడారు. వీళ్లందరూ టెస్టుల్లో బరిలోకి దిగారు. రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో టీ20లు, వన్డే సిరీస్​లకు దూరంగా ఉన్నారు. అయితే రోహిత్, విరాట్ లేకున్నా టీ20 సిరీస్​ను సమం చేసింది యంగ్ ఇండియా. వీళ్ల ఎంట్రీతో టెస్ట్ సిరీస్​ను సమం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ భారత్​కు నేర్పిన పాఠాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సఫారీ టూర్​లో వన్డేలు, టీ20ల్లో భారత్ ఆకట్టుకుంది. ఈ రెండు ఫార్మాట్లను మినహాయిస్తే టెస్టుల్లోనే టీమిండియాకు రియల్ టెస్ట్​ ఎదురైంది. ఈ సిరీస్ నుంచి రోహిత్ సేన చాలా విషయాలను నేర్చుకుంది. రెండో మ్యాచ్​లో నెగ్గి సిరీస్​ను సమం చేసినప్పటికీ టీమ్​లోని చాలా లోపాలు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాటింగ్ ఫెయిల్యూర్. ఒక్క విరాట్ కోహ్లీ తప్పితే ఈ సిరీస్​లో ఏ భారత బ్యాటర్ కూడా అనుకున్నంతగా రాణించలేదు. అదనపు పేస్, అనూహ్యమైన బౌన్స్ ఉన్న సౌతాఫ్రికా పిచ్​లపై సంయమనం, ఓపికతో ఆడుతూ ఇన్నింగ్స్​ను బిల్డ్ చేయాలనే కిటుకును మిస్సయ్యారు. కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలిచాడు.

కేఎల్ రాహుల్ ఫస్ట్ టెస్ట్​లో సెంచరీతో మెరిసినా ఆ తర్వాత ఫెయిలయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్ట్​లో మోస్తరుగా రాణించాడు. ఇక మిగతా బ్యాటర్లలో ఎవరి గురించి పెద్దగా మాట్లాడేందుకు లేదు. అందరూ మూకుమ్మడిగా ఫెయిలయ్యారు. టెస్ట్ సిరీస్​లో సెలక్షన్ తప్పిదాలు కూడా కనిపించాయి. ఏమాత్రం అనుభవం లేని యశస్వి జైస్వాల్​తో పాటు వన్డేల్లో మాత్రమే సక్సెస్ అవుతున్న శుబ్​మన్ గిల్​ను ఆడించడం వర్కవుట్ కాలేదు. రబాడ, బర్గర్, యాన్సన్, ఎంగిడి లాంటి బౌలర్లను ఎదుర్కోలేక వీళ్లిద్దరూ బ్యాట్లు ఎత్తేశారు. అయితే టార్గెట్ చిన్నగా ఉండటంతో రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్​లో జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్​తో అలరించాడు. అతడితో పాటు గిల్ మరింతగా రాటుదేలాలి. ఫస్ట్ టెస్ట్​లో ఘోరంగా ఫెయిలైనా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను రెండో టెస్ట్​లో ఆడించింది టీమ్ మేనేజ్​మెంట్. కానీ అతడు ఆ మ్యాచ్​లోనూ ఆకట్టుకోలేదు. అతడు వేసిన ఓ ఓవర్​లో మార్క్​రమ్ ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.

ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె టీమ్​లో లేని లోటు ఈ టూర్​లో క్లియర్​గా కనిపించింది. వరుసగా వికెట్లు పడుతుంటే ఆదుకునేవాళ్లు, ఇన్నింగ్స్​ బిల్డ్ చేయడంలో సపోర్ట్ చేసేవాళ్లు లేకపోవడంతో రెండు టెస్టుల్లోనూ విరాట్ కోహ్లీ ఒక్కడే అయిపోయాడు. పుజారా, రహానెల్లో కనీసం ఒక్కర్ని తీసుకున్నా బాగుండేది. ఈ టూర్ నేర్పిన మరో పాఠం ప్రాక్టీస్. టెస్ట్ సిరీస్​కు భారత్ ఏమాత్రం ప్రిపేర్ కాలేదు. సరైన ప్రాక్టీస్ లేకుండానే గ్రౌండ్​లోకి దిగింది. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఫస్ట్ టెస్ట్​లో ఏకంగా ఇన్నింగ్స్ పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే రెండో టెస్ట్​కు ముందు ఫుల్​గా ప్రిపేర్ అయింది భారత్. రోహిత్, విరాట్ సహా ప్రతి ప్లేయర్ ఎక్స్​ట్రా టైమ్ ప్రాక్టీస్ చేశారు. సరైన ప్లాన్స్​తో గ్రౌండ్​లోకి దిగడమే గాక వాటిని పర్ఫెక్ట్​గా ఎగ్జిక్యూట్ చేశారు. కాబట్టి సన్నాహకాల విలువ ఏంటో మన టీమ్​కు తెలిసొచ్చింది. మరి.. సౌతాఫ్రికా సిరీస్​ భారత జట్టుకు ఇంకేమైనా పాఠాలు నేర్పిందని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Aamer Jamal: 32 ఏళ్ల తరువాత పాక్ జట్టులో మరో ఇమ్రాన్ ఖాన్! ఆస్ట్రేలియానే వణికించాడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి