iDreamPost

Hyderabad: మీరేం మనుషుల్రా నాయనా.. రూ.కోటి విలువైన కారుకు నిప్పు పెట్టారు

  • Published Apr 14, 2024 | 6:03 PMUpdated Apr 14, 2024 | 6:03 PM

కోపంలో కొందరు చేసే పనులు భారీ నష్టాన్ని మిగులుస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కోటి రూాపయల విలవైన కారుకు నిప్పు పెట్టారు దుండగులు. ఆ వివరాలు..

కోపంలో కొందరు చేసే పనులు భారీ నష్టాన్ని మిగులుస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కోటి రూాపయల విలవైన కారుకు నిప్పు పెట్టారు దుండగులు. ఆ వివరాలు..

  • Published Apr 14, 2024 | 6:03 PMUpdated Apr 14, 2024 | 6:03 PM
Hyderabad: మీరేం మనుషుల్రా నాయనా.. రూ.కోటి విలువైన కారుకు నిప్పు పెట్టారు

కొందరు చేసే పనులు చూస్తే.. వారికి అసలు మైండ్ పని చేస్తుందో లేదో అర్థం కాదు. అరే మీ కన్నా చిన్న పిల్లలు నయం కదా అనిపిస్తుంది. ఎందుకంటే సదరు వ్యక్తులు తమ ఆలోచనల మీద పట్టు కోల్పోయి.. క్షణికావేశంలో విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సార్లు తమకు తామే హాని చేసుకుంటే.. కొన్ని సందర్భాల్లో.. ఖరీదైన వస్తువులను నాశనం చేస్తుంటారు. మన దగ్గర చాలా మంది కోపంలో ఫోన్, రిమోట్ వంటివి పగలకొట్టడం చాలా సార్లు చూసి ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన వాటన్నింటికి మించి. ఇక్కడ కొందరు వ్యక్తులు ఒళ్లు తెలియని కోపంలో కోటి రూపాయల ఖరీదైన కారుకు నిప్పు పెట్టి తగలబెట్టారు. ఆ వివరాలు..

ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న అక్కసుతో కోటి రూపాయల విలువైన స్పోర్ట్స్ కారును కాల్చి బూడిద చేశారు దుండగులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన భాగ్యనగరంలోని పాతబస్తీ ​పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్సింగ్‌ ప్రాంతానికి చెందిన నీరజ్ అనే వ్యాపారి కొన్ని రోజుల క్రితం రూ.4 కోట్ల విలువ కలిగిన లంబోర్ఘిని స్పోర్ట్స్ ​కారు‌ను సెకండ్ ​హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. కొన్నాళ్ల పాటు వాడుకున్నాక.. దాన్ని అమ్మేయాలనుకున్నాడు.

కారు అమ్మడం కోసం తనకు పరిచయస్తుడైన అయాన్ ​అనే వ్యక్తిని కలిసాడు నీరజ్. తన కారును అమ్మి పెట్టాల్సిందిగా అయాన్ ను కోరాడు. కారు అమ్మే క్రమంలో అయాన్ తన స్నేహితుడైన హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌​పురా ప్రాంతానికి చెందిన అమన్‌ను సంప్రదించాడు. అలా కారు అమ్మకం విషయం ఒకరి ద్వారా ఒకరికి చేరవేస్తూ పోయారు. ఈ క్రమంలో అమన్ స్నేహితుడు అహ్మద్..కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అతడికి తెలిపాడు. కారును చూసుకునేందుకు మామిడిపల్లి నుంచి శంషాబాద్ వెళ్ళే దారిలో ఉన్న తన ఫాం హౌజ్‌కు తీసుకురావాలంటూ అమన్ కు సూచించాడు అహ్మద్. అమన్ ఆ విషయయ అయాన్ కు చెప్పడంతో.. అతడు నీరజ్ ను సంప్రదించాడు.

శనివారం సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లిలోని ఫామ్‌హౌస్‌ వద్దకు కారు తీసుకురావాలని అహ్మద్‌ చెప్పడంతో, అయాన్‌ కారు తీసుకొచ్చి జల్‌పల్లి వద్ద అమన్‌కు అప్పగించాడు. అక్కడి నుంచి అమన్‌ తన స్నేహితుడు హందాన్‌తో కలిసి కారు నడుపుకుంటూ అహ్మద్‌ చెప్పిన మామిడిపల్లి వివేకానంద చౌరస్తాను దాటి ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు వైపు డైవర్షన్ తీసుకొని వెళ్లాడు.

అమన్ అక్కడకు చేరుకోగానే.. అహ్మద్‌.. అతనితో పాటు మరికొంత మంది స్నేహితులు అక్కడికి వచ్చారు. నీరజ్‌ ఎక్కడ..? అతడు మాకు డబ్బులు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అహ్మద్‌.. అతని వెంట వచ్చిన స్నేహితులు కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో అమన్ ​డయల్​100 కి కాల్ చేసి విషయం చెప్పాడు. సమాచారం తెలుసుకున్న పహాడీషరీఫ్ ​పోలీసులు, ఫైర్​ఇంజన్​ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యింది. అమన్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి