iDreamPost

Gold Mines: AP లోని మరో ప్రాంతంలో బంగారు గనులు.. ఎక్కడంటే..

  • Published Dec 14, 2023 | 1:32 PMUpdated Dec 14, 2023 | 1:32 PM

బంగారం తవ్వకాలు అనగానే కేజీఎఫ్ సినిమానే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీలోని ఓ ప్రాంతం కూడా అలానే మారనుంది. కారణం అక్కడ బంగారు గనులు వెలుగు చూశాయి. ఆ వివరాలు..

బంగారం తవ్వకాలు అనగానే కేజీఎఫ్ సినిమానే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీలోని ఓ ప్రాంతం కూడా అలానే మారనుంది. కారణం అక్కడ బంగారు గనులు వెలుగు చూశాయి. ఆ వివరాలు..

  • Published Dec 14, 2023 | 1:32 PMUpdated Dec 14, 2023 | 1:32 PM
Gold Mines: AP లోని మరో ప్రాంతంలో బంగారు గనులు.. ఎక్కడంటే..

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బంగారు గనులు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తుగ్గలి మండలంలో బంగారు గనులున్నట్లుగా గుర్తించడమే కాక.. అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. తాజాగా జియోలాజిలక్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కూడా బంగారం గనులున్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు. సాధారణంగా కర్నూలు అనగానే అందరికి వజ్రాల వేటనే గుర్తుకు వస్తుంది. వర్షాకాలం ప్రారంభంలో రైతులతో పాటూ రైతు కూలీలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు. అయితే వారందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. ఇక్కడ బంగారు గనులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర జియోలాజికల్‌ బోర్డు సమావేశంలో .. కర్నూలు జిల్లా డీడీ రాజశేఖర్‌, నంద్యాల జిల్లా ఏడీ రామచంద్రలకు సర్వేల వివరాలు తెలియజేశారు. ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. అక్కడ లభ్యమయ్యే బంగారం ఖనిజ నిల్వల పరిమాణం, నాణ్యత, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి వంటి ఇతర అంశాలను నిర్ధారించడానికి వీలుగా సమగ్ర సర్వే చేయాలని జీఎస్‌ఐ అధికారులు నిర్ణయించారు. ఇక తమ గ్రామంలో బంగారు గనులు వెలుగు చూడటంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఆస్పరి మండలంలో.. బంగారు గనులు వెలుగులోకి రావడంతో.. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేయడం లాభదాయకమా.. కాదా.. అన్న విషయాన్ని కూడా తేల్చనున్నారు జీఎస్ఐ అధికారులు. అందుకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వేను పూర్తి చేయాలని జీఎస్‌ఐ భావిస్తోంది. దీంతో పాటు తాడిపత్రికి 12 కి.మీ. దూరంలో గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయని.. వాటి పరిమాణాన్ని అంచనా వేసేందుకు వోఎన్జీసీ సంస్థ సైతం సర్వే చేపట్టనుంది.

అలానే ఏపీలోని జొన్నగిరి ప్రాజెక్ట్‌లో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఏడాదికి 750 కిలోగ్రాముల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ మైన్‌లో వచ్చే ఏడాది చివరికి (అక్టోబరు, నవంబరు) పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు.

ఇక కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల్లో బంగారు గని విస్తరించి ఉందని జీఎస్ఐ అధికారులు తెలిపారు. దీనిని జొన్నగిరి గోల్డ్‌ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. ఈ గనికి 2013లోనే అనుమతులు వచ్చాయి. బంగారాన్ని తవ్వి తీయడానికి అవసరమైన ముందస్తు పనులన్నీ పూర్తి చేయడానికి 8-10 సంవత్సరాలు పట్టింది అని వెల్లడించారు అధికారులు. ఈ క్రమంలో ఎన్‌ఎండీసీ రాష్ట్రంలో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాల తవ్వకాల కోసం.. గనులు కేటాయించాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో గనులు ఉన్నట్లు జీఎస్ఐ అధికారులు గుర్తించారట. వీటిలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పెరవలి, బేతపల్లితో పాటుగా చిత్తూరు జిల్లా రాజగొల్లపల్లి, నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాలెం గనుల బ్లాకులను కేటాయించాలని దరఖాస్తు చేశారట. ఈ గనుల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలను తవ్వుకునేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. మొత్తం మీద ఏపీలో బంగారు గనులు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని నాలుగు (అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు) జిల్లాల్లో ఈ నిక్షేపాలను గుర్తించారు. దాంతో ఆ ప్రాంత వాసులు.. మా దగ్గర కూడా కేజీఎఫ్ స్థాయిలో గోల్డ్ దొరకనుంది అని చర్చించుకుంటున్నారట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి