iDreamPost

రేషన్‌కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌ : ఉచిత బియ్యం పంపిణీ కొనసాగింపు..

రేషన్‌కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌ : ఉచిత బియ్యం పంపిణీ కొనసాగింపు..

రేషన్‌కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకం కింద అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి వరకూ రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం, శెనగలు అందించనున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సరుకులకు ఇది అదనం.

కరోనా వైరస్‌ వల్ల ఉపాధి కోల్పోవడం, లాక్‌డౌన్‌ విధింపు తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ముందుగా ప్రకటించిన మేరకు ఈ నెల వరకూ ఉచిత బియ్యం పంపిణీ కొనసాగింది. ఉచిత బియ్యం పంపిణీని నిలిపివేస్తారా..? కొనసాగిస్తారా..? అనే సందేహం నెలకొన్న సమయంలో.. మార్చి వరకూ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తెలిపింది.

ప్రతి నెల మొదటి అర్థభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ సరుకులను డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యం, కార్డుకు కిలో కందిపప్పు, అరకేజీ చక్కెర సబ్సీడీ ధరలకు ఇస్తున్నారు. ద్వితియ అర్థభాగంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలోనూ కార్డులోని సభ్యుడికి ఐదు కేజీల చొప్పున బియ్యం, కార్డుకు కేజీ శెనగలు ఉచితంగా ఇస్తున్నారు.

ఈ పథకాన్ని మార్చి వరకూ కొనసాగించడంతో.. ఏడాది పాటున పేదలకు ఉచిత బియ్యం, శెనగలు అందినట్లువుతుంది. ఏపీలో దాదాపు 1.50 కోట్ల మందికి రేషన్‌కార్డులున్నాయి. వీరందరికీ ప్రయోజనం కలగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి