ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ తొలి సారి భారత్లో ట్రాక్ ఎక్కనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లాంఛనంగా అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, నీతి ఆయోగ్ సిఇఒ అమితాభ్ కాంత్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫార్ములా-ఇ ప్రిక్స్ ఈవెంట్ను ప్రపంచంలోని పన్నెండు దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, అందులో భారత్ కూడా ఒకటని గుర్తుచేశారు. ఇప్పుడు హైదరాబాద్లో జరగనున్నది ఈ ఈవెంట్కు సంబంధించిన తొమ్మిదవ సీజన్ అని వివరించారు.
గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్ టౌన్, మొనాకో, దిరియా (సౌదీ అరేబియా) సరసన నిలివనుంది. రానున్న నాలుగు సంవత్సరాల వరకు ఈ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. 2014లో ప్రారంభమైన ఫార్ములా-ఈ రేసింగ్ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకుంది. నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి హెచ్ఎండిఎ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఏర్పాట్లను చూడనున్నారు.