iDreamPost

కరోనా వైరస్ నుంచి విముక్తి పొందిన 5 రాష్ట్రాలు

కరోనా వైరస్ నుంచి విముక్తి పొందిన 5 రాష్ట్రాలు

భారత ఈశాన్య ప్రాంతంలోని 8 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలు కరోనా వైరస్ నుంచి విముక్తి పొందినట్టు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర ప్రసాద్ ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన కరోనా విముక్త రాష్ట్రాల జాబితాలో ఇండియా సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలు అయిన నాగాలాండ్,అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురలతో పాటు సిక్కిం కూడా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ కేంద్రంతో కలిసి కరోనా కట్టడికి శ్రమించాయని తెలిపాడు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు షిల్లాంగ్‌లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తున్నామని మంత్రి కితాబిచ్చాడు.

ఇంకా మంత్రి వివరాలు తెలియజేస్తూ ఈశాన్యంలోని అసోం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఇంకా కరోనా నుంచి విముక్తి పొందలేదు. కానీ గత కొంతకాలంగా ఆ మూడు రాష్ట్రాలలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదు’ అని మంత్రి ప్రకటించారు. గత ఆరేళ్లుగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి మోదీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందునే ఆయా రాష్ట్రాలలో తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఈ ఘనత ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ నిత్యవసర సరుకుల కొరత రాకుండా గత మార్చి 30 నుంచి ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు.ఈశాన్య రాష్ట్రాలతోపాటు పర్వత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ లకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ తమను ఆదేశించినట్లు మంత్రి జితేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి