iDreamPost

కియా పై క్లారిటీ ఇచ్చిన మంత్రి

కియా పై క్లారిటీ ఇచ్చిన మంత్రి

అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా కార్ల తయారీ కంపెనీ తరలిపోతోందంటూ.. ఓ వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కియా తరలిపోతుందంటూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కియా ఎక్కడకీ పోవడంలేదని చెప్పారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన బుగ్గన పై విధంగా స్పందించారు.

కియా పరిశ్రమ యాజమాన్యం సంతృప్తికరంగా ఉన్న సమయంలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం తగదని హితవు పలికారు. ఇలా చేస్తే.. సదరు వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాంట్‌ తరలిపోతుందంటూ జరిగిన ప్రచారాన్ని కియా సంస్థ కూడా ఖండించిన విషయం ఈ సందర్భంగా బుగ్గన గుర్తు చేశారు.

టీడీపీ నేతలకు కూడా బుగ్గన గట్టి కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలాగా తాము ప్రచారం కోసం ప్రాకులాడబోమని చురకలంటించారు. టీడీపీ నేతలు దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1252 కంపెనీలకు భూములు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి