iDreamPost

ఎన్నికల కోడ్‌: పోలీసులు సీజ్‌ చేసిన డబ్బు, నగలు ఎలా పొందాలంటే

  • Published Oct 20, 2023 | 4:09 PMUpdated Oct 20, 2023 | 4:09 PM

తెలంగాణలో ఎలక్షన్‌ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. భారీ ఎత్తున నగదు, బంగారాన్ని తరలిస్తే పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. మరి ఇలా సీజ్‌ చేసిన సొత్తు పొందాలంటే ఏం చేయాలి.. ఎలా తిరిగి తెచ్చుకోవాలంటే..

తెలంగాణలో ఎలక్షన్‌ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. భారీ ఎత్తున నగదు, బంగారాన్ని తరలిస్తే పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. మరి ఇలా సీజ్‌ చేసిన సొత్తు పొందాలంటే ఏం చేయాలి.. ఎలా తిరిగి తెచ్చుకోవాలంటే..

  • Published Oct 20, 2023 | 4:09 PMUpdated Oct 20, 2023 | 4:09 PM
ఎన్నికల కోడ్‌: పోలీసులు సీజ్‌ చేసిన డబ్బు, నగలు ఎలా పొందాలంటే

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. ఈ ఏడాది నవంబర్‌ 30 న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. నగదు, విలువైన లోహాల తరలింపుకు సంబంధించి అనేక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి.. తెలంగాణవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టాలని చూసే వారికి పోలీసులు షాక్‌ ఇస్తున్నారు. ఇక 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన పది రోజుల్లోనే.. ఏకంగా 130 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం, మద్యాన్ని సీజ్‌ చేశారు పోలీసులు.

అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చన నాటి నుంచి పోలీసులు తనిఖీల కారణంగా సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. దీనిపై విమర్శలు కూడా వస్తుండటంతో.. తాజాగా దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. సీజ్‌ చేసిన సొత్తును తిరిగి పొందేందుకు జిల్లాల్లో గ్రీవెన్స్‌ సెల్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. వీటిని సంప్రదించడం ద్వారా సీజ్‌ చేసిన సొత్తును తిరిగి పొందవచ్చని వెల్లడించింది. ఇందుకు ఏం చేయాలంటే..

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఫలితంగా రూ. 50 వేల వరకు నగదు, 10 గ్రాముల బంగారాన్ని మించి ఒక చోటు నుంచి మరో చోటుకి తరలిస్తే పోలీసులు సీజ్ చేస్తున్నారు. అయితే దీని వల్ల వ్యాపారులు, హవాలా సొమ్ము తరలించేవారితో పాటు.. సామాన్యుల దగ్గర ఉన్న సొత్తును సైతం పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటున్న ఓ కుంటుబం పెళ్లి కోసం తీసుకెళ్తున్న బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ వెలుగు చూడటంతో.. పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

విమర్శల నేపథ్యంలో డబ్బు, నగదు తరలింపుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇలా రికవరీ చేసిన సామాన్యుల సొమ్మును బాధితులకు తిరిగి ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో గ్రీవెన్స్‌సెల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. పోలీసుల తనిఖీల్లో చిక్కిన నగదు, బంగారు ఆభరణాల యజమానులు ఈ సెల్‌ ఛైర్మన్‌ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే.. 48 గంటల్లోనే వాటిని తిరిగిచ్చేస్తామని ప్రకటించింది. అయితే ఇలా సీజ్‌ చేసిన సొత్తు విలువ రూ.10 లక్షలలోపు మాత్రమే ఉండాలని ఈసీ నిబంధన పెట్టింది. అంతకు మించి విలువైన సొత్తు ఉంటే.. ఐటీ అధికారులకు వివరాలు వెల్లడించాలని సూచించింది.

సీజ్‌ చేసిన సొత్తును తిరిగి ఎలా పొందాలంటే..

  1. తనిఖీల్లో భాగంగా పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు, బంగారాన్ని.. సంబంధిత పోలీసు స్టేషన్‌లో భద్రపరిచి కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన సమాచారాన్ని.. సంబంధిత సొత్తు యజమానులకు అందజేస్తారు.
  2. ఇలా భద్రపరిచిన సొత్తు వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌, ఐటీ అధికారులకు పంపిస్తారు.
  3. ఇక వీటిని తిరిగి పొందాలనుకునేవారు పోలీసు కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో చూపించాలి. అక్కడి అధికారులు దానిని గ్రీవెన్స్‌సెల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు.
  4. అనంతరం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌ ఛైర్మన్‌ను కలిసి.. ఆయనకు సీజ్‌ చేసిన సొత్తుకు సంబంధించిన కేసు వివరాలు, ఆధారాలు అందివ్వాలి.
  5. ఆ తర్వాత గ్రీవెన్స్‌ సెల్‌ అధికారులు.. సొత్తు యజమానికి దీనికి సంబంధించి ఓ రసీదు ఇచ్చి తమ అధికారులు ఫోన్‌ చేసినప్పుడు రావాలని సూచిస్తారు.
  6. 48 గంటల్లోపు సదరు బాధితులను పిలిపించి వారు సమర్పించిన ఆధారాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్నీ సరిగా ఉంటే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేస్తారు.
  7. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి సొత్తు తిరిగిచ్చేయాలని వాటిని నిల్వ చేసిన పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేస్తారు.
  8. ఆ తర్వాత సొత్తు యజమానులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ సొత్తును తీసుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి