iDreamPost

Drushyam 2 : వెంకీ అభిమానుల కోపం చల్లరేనా

Drushyam 2 : వెంకీ అభిమానుల కోపం చల్లరేనా

మరో టాలీవుడ్ సినిమా దృశ్యం 2 డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. పేరుకి ఎల్లుండే విడుదలైనప్పటికీ అమెజాన్ ప్రైమ్ తన సంప్రదాయాన్ని అనుసరించి రేపు రాత్రి 10 గంటల నుంచే ప్రీమియర్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. నారప్ప తర్వాత వరసగా రెండో డిజిటల్ విడుదలకు సిద్ధపడిన వెంకీ మీద నిర్మాత సురేష్ బాబు మీద అభిమానులు కాసింత గుస్సాగానే ఉన్నారు. ముక్కు మొహం తెలియని చిన్న సినిమాలే ధైర్యంగా థియేటర్లకు వస్తుంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, స్టార్ హీరోని చేతిలో పెట్టుకుని ఇలా చేయడం ఏమిటనేది వాళ్ళ అసహనానికి కారణం. అందుకే సోషల్ మీడియాలో ఈసారి నారప్ప రేంజ్ హడావిడి కనిపించడం లేదు.

ఇదంతా ఎలా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన దృశ్యం 2 వ్యూస్ మీద ప్రైమ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇటీవలే జై భీమ్ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న అమెజాన్ దాన్ని రాంబాబు డ్రామా కొనసాగిస్తుందనే నమ్మకంతో ఉంది. దృశ్యం తర్వాత ఈ సీక్వెల్ కి చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఆకట్టుకునే బలమైన కంటెంట్ ఇందులో ఉంది. మలయాళం వెర్షన్ కూడా ఇదే తరహాలో నేరుగా ప్రైమ్ లో వచ్చినప్పుడు ప్రేక్షకులు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ఆడియన్స్ లో సబ్ టైటిల్స్ సహాయంతో చూసినవాళ్లు ఎందరో. అందుకే దృశ్యం 2 మీద అంచనాలు గట్టిగా ఉన్నాయి. ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తున్నారు.

ఇప్పుడీ సినిమా గేమ్ ఛేంజర్ కావొచ్చనే అంచనాలో విశ్లేషకులు ఉన్నారు. వి, నిశ్శబ్దం, ఆకాశం నీ హద్దురా, నారప్ప, టక్ జగదీశ్, మాస్ట్రో ల తర్వాత నేరుగా ప్రేక్షకుల ఇళ్లకే వస్తున్న ఈ మూవీకి వచ్చే స్పందన కనక వీటి కన్నా ఎక్కువగా ఉంటే ఇకపై కొత్త సినిమాలకు ప్రైమ్ ఆఫర్ చేయబోయే మొత్తం ఇంకా పెరుగుతుంది. నిర్మాతలు తాము ముందు సేఫ్ అవ్వడమే చూసుకుంటున్న నేపథ్యంలో ఇకపై థియేటరా ఓటిటినా అని అలోచించి మరీ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పటికే కొనసాగుతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం 2లో ఇద్దరు ముగ్గురు తప్ప మెయిన్ క్యాస్టింగ్ మొత్తం 1లో ఉన్నవాళ్లే ఇందులోనూ కొనసాగారు

Also Read : NTR31 : ఒకే స్టెప్పు కోసం పద్దెనిమిది టేకులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి