iDreamPost

మెసేజ్‌లతో హీరోయిన్‌ని వేధించిన డైరెక్టర్.. మఫ్టీలో పట్టుకున్న పోలీసులు..

మెసేజ్‌లతో హీరోయిన్‌ని వేధించిన డైరెక్టర్.. మఫ్టీలో పట్టుకున్న పోలీసులు..

ఆమేమీ చిన్న హీరోయిన్ కాదు. పేరున్న న‌టి. ఒంటిచేత్తో సినిమాను లాక్కురాగ‌ల స్థాయి ఆమెది. అలాంటి స్టార్ హీరోయిన్ కూ వేధింపులు త‌ప్ప‌లేదు.

ఇటీవలే మలయాళ నటుడు విజయ్ బాబుపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేసి పోలీసులకి ఫిర్యాదు చేయగా అతన్ని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లడంతో అతను పరారీ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ బాబు పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తాజాగా ఓ డైరెక్టర్ పై వేధిస్తున్నాడంటూ మలయాళ అగ్ర హీరోయిన్ పోలీసులకి ఫిర్యాదు చేసింది.

మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ 2020లో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో ‘కయాట్టం’ అనే సినిమా చేసింది. ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. అయితే ఆ సినిమా అనంతరం డైరెక్టర్ సనల్ కుమార్ మంజు వారియర్ ని సోషల్ మీడియాలో, ఫోన్ లో అదే పనిగా మెసేజ్‌లు పంపిస్తూ వేధించడం మొదలు పెట్టాడు. స్టార్ హీరోయిన్ కావడంతో మొదట వార్నింగ్ ఇచ్చి, నంబర్ బ్లాక్ చేసి వదిలేసింది. అయినా సనల్ కుమార్ పదే పదే సోషల్ మీడియాలో మెసేజ్ లు పంపిస్తూ మంజుని వేధింపులకు గురిచేశాడు. దీంతో విసిగిపోయిన మంజు వారియర్ ఆ డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంజు వారియర్ మే 4న డైరెక్టర్ సనల్ కుమార్‌పై కొచ్చి పోలీసులకి తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మఫ్టీలో మే 5న తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తరువాత అతన్ని కొచ్చికి తరలించారు. స్టార్ హీరోయిన్ ని డైరెక్టర్ వేధించడంతో ఈ వార్త మలయాళం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి