iDreamPost

పుకార్లకు దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్

పుకార్లకు దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్

విడుదల టైంలో కార్తికేయ 2కి సరిపడా థియేటర్లు రాకపోవడంలో దిల్ రాజు ప్రమేయం ఉందన్నట్టుగా కొంత మీడియా వర్గం ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిఖిల్ కొన్ని ఇంటర్వ్యూలలో తననే పదే పదే వాయిదా వేసుకోమని ఒత్తిడి చేశారని గతంలో చెప్పాడు. అది దిల్ రాజుకే అన్వయించేసి కథనాలు వడ్డించేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏకంగా చిత్ర విచిత్ర కథనాలు వండేసి వీడియోలు చేసుకుంది. ఇదంతా వైరల్ కావడంతో వీటికి చెక్ పెట్టేందుకు కార్తికేయ 2 సక్సెస్ మీట్ నే వేదికగా మార్చుకున్నారు దిల్ రాజు. హీరోతో సహా టీమ్ మొత్తం వేదిక మీద ఉండగా మీడియా ముఖంగా ఆ ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చారు .

జూలై 22 థాంక్ యు కోసం ఆ డేట్ ని అడిగిన మాట వాస్తవమేనని వాళ్ళు ఆగస్ట్ 5 అనుకున్నప్పుడు ఆల్రెడీ రెండున్నాయి కదా ఆలోచించుకుని నిర్ణయించుకోమని చెప్పారట. అంత పోటీలో దిగడం ఇష్టం లేక ఆగితే విక్రమ్ కోబ్రా క్యాన్సిల్ అయ్యిందని తెలిసి ఆగస్ట్ 11 లేదా 12 ఫిక్స్ చేసుకున్నారట. కానీ ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు క్లాష్ అవ్వడం మంచిది కాదు కాబట్టి ఆ మేరకు ఓసారి విశ్లేషించుకుని ఆ తర్వాత డెసిషన్ తీసుకోమని చెప్పారు. అలా ఫైనల్ గా 13 లాక్ అయింది. కావాలని తనేం ఎవరికీ అడ్డు పడలేదని సినిమాలు బాగుండి ఆడితే అంతకంటే కావలసింది ఏముంటుందని వీటిని ప్రచారం చేసిన వాళ్లకు చురకలు కూడా వేశారు.

కేవలం లైక్స్ కోసమో వ్యూస్ కోసమో నిజానిజాలు తెలుసుకోకుండా రాయడం సరికాదని, బేసిక్ కామన్ సెన్స్ ఒకటి ఉంటుందని కౌంటర్ వేశారు. అయితే ఎక్కడ ఈ ప్రసంగంలో మాచర్ల నియోజకవర్గం ప్రస్తావన రాకపోయినప్పటికీ నిజానికి దాని గురించే కార్తికేయ 2 స్క్రీన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయనే గాసిప్ బయటికి వచ్చింది. నిఖిల్ తో తన అనుబంధం గురించి చెబుతూనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో పాటు అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలకు తనకున్న బాండింగ్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడారు. మొత్తానికి దిల్ రాజు ఒకరకంగా ఫైర్ అయ్యారనే చెప్పాలి. ఇదంతా ఎలా ఉన్నా నార్త్ నుంచి సౌత్ దాకా కార్తికేయ 2 స్పీడ్ మాత్రం చాలా జోరుగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి