iDreamPost

పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ప్రియం: తొలిసారి రికార్డు

పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ప్రియం: తొలిసారి రికార్డు

ఎక్కడి మార్కెట్లోనైనా ఎప్పుడైనా పెట్రోల్‌ ధర ఎక్కువ, డీజిల్‌ ధర తక్కువగా ఉంటుంది. కానీ ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా మొట్టమొదటిసారి పెట్రోల్‌ ధరను డీజిల్‌ ధర దాటేసింది.

వరుసగా 18వ రోజూ డీజిల్‌ ధరను చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. కాని పెట్రోల్‌ ధర మాత్రం ఈరోజు పెంచలేదు. డీజిల్‌ ధర బుధవారం దేశవ్యాప్తంగా 48 పైసలు పెరగడంతో ఢిల్లీ మార్కెట్లో లీటరు డీజిల్‌ ధర రూ.79.88కి చేరుకుంది.

పెట్రోల్‌ ధర మాత్రం రూ.79.76 వద్ద ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.86.54 ఉంటే డీజిల్‌ ధర రూ.78.22గా ఉంది. ఇక చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.83.04, డీజిల్‌ ధర రూ.77.17గా, హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.82.79, డీజిల్‌ ధర రూ.78.06గా ఉంది.

ఒక్క ఢిల్లీలో మాత్రమే పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ధర అధికంగా ఉంది. ఇందుకు కారణమేమిటంటే.. గత నెలలో ప్రభుత్వం ఇంధనాలపై స్థానిక అమ్మకం పన్ను లేదా విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను భారీగా పెంచింది.

మే 5న పెట్రోల్‌పై వ్యాట్‌ను 27 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్‌పై 16.75 శాతం నుంచి 30 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  డీజిల్‌పై అదనంగా ఎయిర్‌ యాంబియెన్స్‌ లెవీ కింద కిలో లీటరుపై రూ.250 విధించారు. దీని వల్ల ధర మరింత ఎగబాకింది. మే 5న ఈ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం రూ.7.30 ఉంది. ప్రస్తుతం రాజస్థాన్‌ (రూ.80.68) తర్వాత ఢిల్లీలోనే డీజిల్‌ ధర ఎక్కువ ఉంది.

జూన్‌ 7 నుంచి ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల రోజువారీ సవరణ మొదలుపెట్టాయి. అప్పటి నుంచి లీటరు పెట్రోల్‌ ధర రూ.8.5, డీజిల్‌ రూ.10.5 పెరిగింది. ఇక అహ్మదాబాద్‌లో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సమాన స్థాయికి చేరువలో ఉన్నాయి. చాలా రాష్ర్టాలు డీజిల్‌పై తక్కువ పన్నును విధిస్తున్నాయి. దీని వల్ల పెట్రోల్‌కన్నా డీజిల్‌ ధర తక్కువగా ఉంది. ఇంతకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం రూ.18-20 ఉండేది. కానీ పన్నులను పెంచుతూ పోయిన కొద్దీ ఈ వ్యత్యాసం తగ్గిపోతూవస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి