iDreamPost

లైంగిక వేధింపుల కేసు: బ్రిజ్‌ భూషణ్‌కు బిగ్‌ షాక్‌.. కోర్టు కీలక ఆదేశాలు!

  • Published Jul 08, 2023 | 1:06 PMUpdated Jul 08, 2023 | 1:06 PM
  • Published Jul 08, 2023 | 1:06 PMUpdated Jul 08, 2023 | 1:06 PM
లైంగిక వేధింపుల కేసు: బ్రిజ్‌ భూషణ్‌కు బిగ్‌ షాక్‌.. కోర్టు కీలక ఆదేశాలు!

భారత దేశానికి ఒలింపిక్‌ పతకాలు తీసుకొచ్చిన రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చాలా రోజులు రోడ్లపై పోరాటం చేశారు. మొత్తానికి అతనిపై కేసు కాగా.. రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ నడుస్తోంది.

కేసులో భాగంగా ఈ నెల 18న విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను కోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. నిందితుడిపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని సంచలన విషయం వెల్లడించింది. బ్రిజ్‌ భూషణ్‌తో పాటు సెస్పెన్షన్‌కు గురైన డబ్ల్యూఎఫ్‌ఐ సహాయక కార్యదర్శి వినోద్‌ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ ఈ ఏడాది జనవరి నుంచి వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా లాంటి స్టార్ రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. ఒడిశా రైలు ప్రమాదం కంటే ముందు వరకు వారి పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జూన్‌ 15లోపు బ్రిజ్‌ భూషణ్‌పై ఛార్జీషీటు దాఖలు చేస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇవ్వడంతో రెజ్లర్లు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించారు. కాగా శుక్రవారం కోర్టు ఆదేశాలతో బ్రిజ్‌భూషణ్‌ కచ్చితంగా కోర్టులో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి