iDreamPost

దేశంలో 60 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 60 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 3,320 పాజిటివ్ కేసులు – 95 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడువేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతుండడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3,320 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 59,662కు చేరింది. కాగా కరోనా కారణంగా 1981 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 17,847 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 39,834 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో 19,063 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 731 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణలో 1132 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 10  కేసులు నిర్దారణ అయ్యాయి. 29 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన కొన్ని రోజులుగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 43 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. 1930 మందికి కరోనా సోకగా 44 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 999 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 4,015,107 మందికి కోవిడ్ 19 సోకగా 276,268 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,387,478 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,322,163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 78,616 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి