iDreamPost

కాఫీ విత్ కరణ్.. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్, సమంత.. సౌత్ స్టార్స్‌తో స్పెషల్ ఎపిసోడ్స్

కాఫీ విత్ కరణ్.. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్, సమంత.. సౌత్ స్టార్స్‌తో స్పెషల్ ఎపిసోడ్స్

మన దేశంలో అన్ని భాషల్లో చాలా టాక్ షోలు ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాలుగా కాఫీ విత్ కరణ్ షో బాలీవుడ్ లో చాలా పాపులర్. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా బాలీవుడ్ సెలబ్రిటీలని తీసుకొచ్చి ఈ షోలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఈ షో బాలీవుడ్ లోనే కాక దేశమంతటా పేరు, ఆడియన్స్ ని సంపాదించింది. ఇప్పటికే 6 సీజన్లని పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇక పై ఆపేస్తాను అని అభిమానులకి, ప్రేక్షకులకి షాకిచ్చాడు కరణ్ జోహార్. మళ్లీ వెంటనే రెండు రోజుల్లో ఈ సారి 7వ సీజన్ ఓటీటీలో రాబోతుందని ప్రకటించాడు.

అయితే ఈ సారి 7వ సీజన్ మరింత స్పెషల్ గా ఉండనుంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో కూడా సౌత్ సినిమా ఆధిపత్యం చెలాయిస్తోంది. సౌత్ సినిమాలన్నీ వరుస పెట్టి బాలీవుడ్ లో భారీ విజయాల్ని సాధిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ అంతా సౌత్ మీద దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరణ్ జోహార్ కూడా కొన్ని సౌత్ సినిమాల నిర్మాణంలో భాగమయ్యాడు. తాజాగా తన కాఫీ విత్ కరణ్ షో 7వ సీజన్ లో సౌత్ సెలబ్రిటీలను కూడా తీసుకురానున్నట్టు సమాచారం. ఈ సీజన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, సమంత, రష్మిక, విగ్నేష్, నయనతారలని ఇంటర్వ్యూ చేయనున్నట్టు బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.

ఒక స్టార్ ని వేదిక మీద చూస్తేనే అభిమానులు, ప్రేక్షకులు సంతోషిస్తారు. అలాంటిది ఒకేసారి ఇద్దరు స్టార్లని వేదిక మీద చూస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇద్దరు స్టార్లని ఒకేసారి ప్రోగ్రాంకి తీసుకొస్తే మరింత హైప్ వస్తుంది. అందుకే కరణ్ జోహార్ సౌత్ సెలబ్రిటీలతో చేసే ఎపిసోడ్స్ ని ఇద్దరు ఇద్దరి స్టార్స్ తో చేయనున్నారు. బాహుబలితో బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు ప్రభాస్. ఇటీవల పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో భారీ విజయం సాధించాడు. ప్రభాస్-అల్లు అర్జున్ తో కలిపి ఒక ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట కరణ్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్ ని దున్నేశారు. ఈ సినిమా కోసం వీరిద్దరూ కలిసి నటించడమే కాక ప్రమోషన్స్ కూడా కలిసి చేశారు. దీంతో వీళ్లిద్దరికీ నార్త్ లో బాగా క్రేజ్ పెరిగింది. అందుకే ఈ ఇద్దరితో ఓ ఎపిసోడ్ ని ప్లాన్ చేయాలని చూస్తున్నారు కరణ్.

ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో ఫేమ్ తెచ్చుకుంది సమంత. మరోవైపు నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకొని బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ సాధిస్తుంది రష్మిక.వీరిద్దరికి నేషన్ వైడ్ క్రేజ్ ఉంది. అందుకే రష్మిక-సమంతలతో ఓ ఎపిసోడ్ డిజైన్ చేస్తున్నారట కరణ్ జోహార్. సౌత్ లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న కపుల్ పేరు విగ్నేష్ -నయన్. వీరిద్దరూ ఓ పక్కన ప్రేమ పక్షుల్లా దేశమంతటా తిరిగేస్తూ మరో పక్క కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అందుకే సౌత్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ జంటని కూడా కాఫీ విత్ కరణ్ కి తీసుకొస్తారంట కరణ్ జోహార్. ఇంతమంది సౌత్ సెలబ్రిటీలతో కాఫీ విత్ కరణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా పేరు సంపాదించిన ఈ స్టార్స్ తో చేసే సీజన్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి