ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 చేరి ఆ సంఖ్య 26కు పెరిగింది. ఏపీలో పార్లమెంట్ స్థానాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభన చేశారు. కొత్తగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయగా..ఏపీ మొత్తం 72 డివిజన్లు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజలనుంచి వచ్చిన అభ్యంతరాలను, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని కొన్నిచోట్ల ప్రభుత్వం వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.
ఇక కొత్త 13 జిల్లాలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు ఇప్పటికే చేపట్టారు. ఇక తాజాగా ఈ కొత్త జిల్లాలకు కేంద్రం ఎల్జీడీ (లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ) కోడ్లను కేటాయించింది. రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో వీటిని వాడతారు.
అలాగే పంచాయత్, ఈ-పంచాయత్ మిషన్ మోడ్ కింద ఎంటర్ప్రైజ్ సూట్ (పీఈఎస్) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో ఈ ఎల్జీడీ కోడ్లను వాడతారు. ఇక కొత్త జిల్లాలకు ఎల్జీడీ (లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ) కోడ్లు ఈమేరకు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 గా వీటికి కోడ్లు కేటాయించారు.