iDreamPost

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రాజ్యసభలో కీలక ప్రకటన

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రాజ్యసభలో కీలక ప్రకటన

ఎంతోకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వేజోన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో నిన్న బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి రాజ్యసభ వేదికగా వెల్లడించారు.

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు డీపీఆర్ సమర్పించిన తర్వాత కొత్త రైల్వే జోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు పరిధి, ఇతర అంశాలకు సంబంధించి పలు విషయాలు తమ దృష్టికి వచ్చాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.దీంతో ఈ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రం కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు కూడా ఆయన తెలిపారు.

అలాగే, బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2013-14లో రూ.110కోట్లతో మంజూరు చేసిన కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపులను తాజాగా రూ.560.72 కోట్లకి పెంచినట్టు వివరించారు. అలాగే, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ. 178.35 కోట్లు కేటాయించగా రూ. 171.2 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు. అయితే భూ కేటాయింపుల్లో జరిగిన జాప్యం, లాక్‌డౌన్‌ వల్ల పనులు ప్రభావితమైనట్లు ఆయన పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి