iDreamPost

గత ప్రభుత్వ అక్రమాలపై సిబిఐ విచారణ – మంత్రివర్గం సంచలన నిర్ణయం

గత ప్రభుత్వ అక్రమాలపై సిబిఐ విచారణ – మంత్రివర్గం సంచలన నిర్ణయం

గత టిడిపి హయాంలో జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపి ఫైబర్ గ్రిడ్‌లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను మంత్రి వర్గం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక అందజేసింది. సబ్‌ కమిటీ నివేదిక కేబినెట్‌ ముందు ఉంచింది. సబ్‌కమిటీ సూచన మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. 

వైఎస్ఆర్ చేయూతతో మరో ముందడుగు

వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బిసి మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్ట్‌ 12న ఈ పథకాన్ని సిఎం జగన్ ప్రారంభించనున్నారు.

రామాయపట్నం పోర్టుకు కేంద్ర నిధులపై కూడా కేబినెట్‌లో చర్చించారు. కేంద్రం నిధుల కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్లాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు.

రామాయపట్నం పోర్టుకు ఆగస్టు నాటికి టెండర్లు పిలవనున్నారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. డిస్కం, ట్రాన్స్‌కోలకు రూ.6 వేల కోట్ల ఆత్మ నిర్భర్‌ భారత్‌ నిధులు ఖర్చు చేయనున్నారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి