కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ను క్యాట్(సివిల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్) రద్దు చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. దీంతో కృష్ణ కిషోర్ పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఏపీ పరిశ్రమల అభివృద్ధి సలహా మండలిలో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు చంద్రబాబు పాలనలో ఆయన కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చారు. ఆ సమయంలోనే కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారనే అభియోగాలపై ఆయనపై ఉన్నాయి. ఇటీవల పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖలు విడివిడిగా ఈ వ్యవహారంపై నివేదికలు సమర్పించాయి. వాటి ఆధారంగా పెద్ద స్థాయిలో అక్రమాలు సాగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈనెల 12న సస్ఫెన్షన్ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్ యాక్ట్ -2018 ప్రకారం సెక్షన్స్ 188,403,409,120బి కింది కేసు నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కృష్ణకిశోర్ అమరావతి విడిచి వెళ్లకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కృష్ణ కిశోర్ క్యాట్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. కృష్ణ కిశోర్పై ఉన్న కేసును రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్న దానిపై ఆసక్తి మొదలైంది.